21-06-2025 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
అది కరోనా సమయం. అమ్మాయి శ్రావణి ఆహ్వానం మేరకు అంతకు ముందే అమెరికాకు వెళ్లాను. అమ్మాయి ఇల్లు లాస్ఏంజెల్స్లో ఉంటుంది. రిటైర్ అయినవాణ్ణి కనుక ఒక ఆరు నెలలు అమెరికాలో హాయిగా ఉండవచ్చునని అనుకున్నాను. కాని, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది కదా. అమ్మాయి శ్రావణి ఇంట్లో ఆర్నెళ్లు ఉన్నా, ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేక పోయాను.
కరోనా ప్రభావానికి ఇంటి గడప దాటి బయటికి వెళ్లేవాణ్ణి కాదు. తలుపులూ, కిటికీలు మూసి పెట్టడం వల్ల జైలుగదిలో ఉన్న ఫీలింగ్ కలిగింది. నేనక్కడికి చేరుకున్న సమయం సెప్టెంబర్ మాసం. వాతావరణం వేడిగానే ఉంది. ఏం తాగాలన్నీ, ఏది తినాలన్నా భయమే, ఎక్కడ కరోనా దేహం లోపలకు ప్రవేశిస్తుందో అని. దాని పీడ విరగడ కావాలని భగవంతుణ్ణి ధ్యానించాను.
అమెరికా వంటి అగ్రరాజ్యం బాంబులకు భయపడదు గాని, కరోనాకు భయ పడింది. వేలసంఖ్యలో అమెరికన్లు ప్రాణా లు విడిచారు. భారతదేశం కొంత నయమనిపించింది. మన దేశంలోని ఉప్పూ కారం, మసాలాలు కరోనా నుంచి ప్రజల్ని రక్షించాయనే ప్రచారం జరిగింది. ‘ప్రాణాయామం కరోనాకు మందు’ అనే అభి ప్రాయం యోగసాధకులలో ఉంది. కష్టపడని వారినే కరోనా కాటేస్తుందనీ వినిపించింది.
అప్పటికి మూడు నెలలు ఎలాగో గడిచాయి. ఇంకా మూడు నెలలు ఉండాలి. మూడు నెలల్లో ముచ్చటగా మూడు పుస్తకాలు (శ్రీరామ కథాగేయం, మాతృగీత శ తకం, వేదమాత శతకం) రాశాను. మూడు నెలలు మూడు శతకాలకు సరిపోయింది.
టిక్కెట్ రద్దయినా పైసా రాలేదు!
కాని, మిగిలిన 3 నెలలు ఎట్లా గడపా లో తెలియని పరిస్థితి. ఇష్టం లేకపోతే ఎప్పుడైనా ఇండియాకు రావచ్చు. కాని, విమానాలు లేవాయె. లాస్ఏంజెల్స్ నుం చి శాన్ఫ్రాన్సిస్కోకు కారులో వచ్చి, అక్కడ్నించి ఇండియాకు రావాలి. ఏడెనిమిది గంటల ప్రయాణం.
రోడ్డు ప్రయాణం ఎంతో రిస్కు. ‘వందే భారత్’ అమెరికా నుంచి నడుస్తుంది కాని, వారానికి ఒక పర్యాయమే దాని ప్రయాణం. అమెరికాకు వచ్చేటప్పుడు రాకపోకలకు టికెట్ రూ. లక్షా 25 వేలయ్యింది. అమెరికా నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఆ టికెట్ రద్దయ్యింది. విమానం టికెట్ ఆటోమేటిక్గా రద్దయింది కనుక, డబ్బులు వస్తాయేమో అనుకున్నాను. కాని, ఒక్క పైసా రాలేదు.
కరోనా క్షతగాత్రుల గురించి వింటుంటే ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు అమెరికా నుంచి బయటపడాలా అన్న ఆలోచనే తప్ప మరో ధ్యాసే లేదు. మా అల్లుడితో అన్నాను
“నన్ను ఎలాగైనా ఇండియాకు పంపించవయ్యా..” అని.
“తప్పకుండా మామయ్యా. మీరు భయపడకండి!” అని భరోసా అయితే ఇచ్చాడు.
ఇండియా నుంచి, అమెరికా నుంచి నా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. చివరికి రూ. లక్షా డెబ్బది ఐదు వేలకు వందే భారత్ టికెట్ నాకు లభించింది. దాంతో ఇండియాకు చేరగలననే ధైర్యం ఏర్పడింది. కాని, కరోనా పరీక్షల్ని అడుగడుగునా ఎదుర్కోవలసి ఉంది. ఇండియాలో అప్పుడప్పుడే కొంత రిలాక్సేషన్కు అవకాశం ఏర్పడింది. హాస్పటల్స్, హోటల్స్ కరోనా బాధితులతో నిండిపోయయి. ఇక మీద హోం క్వారంటైన్ మాత్రమే దిక్కయ్యింది. తప్పదు మరి. బాధితులు ఎక్కువైనప్పుడు అంత మందికి వసతులు ఎక్కడినుంచి వస్తాయి?
హాస్పటల్స్లో, హోటల్స్లో వాటి యజమానులు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేశారు. అదే సమయంలో నాకు టిక్కెట్ లభించింది. డబ్బు ఎక్కువని చూస్తే ఆలస్యమవుతుంది. కనుక, అల్లుడిని కోరానో లేదో వెంటనే ఆయన కారులో ఎక్కించుకుని ఎనిమిది గంటలు ప్రయాణించి శాన్ఫ్రాన్సిస్కోకు చేర్చాడు. ఆ రోజు రాత్రి తెలిసిన బంధువుల ఇంట్లో ఉండి, మర్నాడు ఉదయమే లగేజీతో ఎయిర్పోర్టుకు చేరుకున్నాను.
బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న సమయంలో ఒకరిద్దరు భారతీయులు కలిశారు. వారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. డైరెక్టుగా కాక విమానాన్ని మార్చి హైదరాబాద్ చేరాలని వారి సంకల్పం. దానివల్ల క్వారెంటైన్ నుంచి బచాయిస్తామని వారి సలహా. అందుకే వారు శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి, ఢిల్లీనుంచి కొచ్చిన్కు, కొచ్చిన్ నుంచి హైదరాబాద్కు టికెట్ తీసుకున్నారు. నాకు మాత్రం డైరెక్ట్గా శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి, ఢిల్లీనుంచి హైదరాబాద్కు ప్రయాణం.
అజ్ఞాత అమ్మాయికి కృతజ్ఞతలు!
లైన్లో నిలుచున్నప్పుడు మా అల్లుడు అక్కడున్న సిబ్బందిని- ‘నన్నుకూడా కొచ్చిన్ మీదుగా హైదరాబాద్కు పంపమని” కోరాడు. అందుకు వారు వెంటనే అంగీకరించి, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. కాని, దాన్ని చదివి చూసుకోలేదు నేను. గేట్ నెంబరు మాత్రం చూసుకుని వెళ్లాను. అందరి లాగా వెయిట్ చేశాను. ఇంతలో విమానంలోకి ప్రవేశించే సమయం రానే వచ్చింది.
ఒక అమ్మాయి నా టిక్కెట్ చూసి-
“ఆర్ యూ గోయింగ్ టు కొచ్చి?” అంది ఇంగ్లీషులో.
“నో.. అయామ్ గోయింగ్ టు హైదరాబాద్” అన్నాను.
“మీరు ఇక్కడినుంచి ఢిల్లీకి, ఢిల్లీనుంచి కొచ్చిన్కు వెళ్లి, అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లాలి” అందామె.
హతాశుడనయ్యాను. ఎక్కడో మిస్టేక్ జరిగింది. ‘మా అల్లుడు మార్చినట్లుంది’ అనుకున్నాను. నా వాలకాన్ని గమనించిన ఆ అమ్మాయి
“మీరు తెలుగు వారా?” అడిగింది.
“ఔనమ్మా... నేను టికెట్ డైరెక్టుగా హైదరాబాద్కు తీసుకున్నాను. కొచ్చిన్కు నేను పోను” అన్నాను.
“సరే.. అంకుల్!...”
ఆమె ఫోన్లో ఎవరితోనో ఏమో మాట్లాడింది, అంతే!నన్ను విమానం ఎక్కనిచ్చారు.
విమానం 16 గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరింది. ఢిల్లీలో మళ్లీ సంబంధిత అధికారులు కొచ్చిన్కు పంపడానికి ప్రయత్నిం చారు. కానీ
“నేను హైదరాబాద్ వాసిని. డైరెక్టుగా హైదరాబాద్ వెళ్లాలి” అని మొరపెట్టుకున్నాను. చివరికి నన్ను హైదరాబాద్కు విమానం ఎక్కడానికి వారు అనుమతించా రు. ఆ తెలుగమ్మాయి శాన్ఫ్రాన్సిస్కోలో నన్ను కొచ్చిన్లో కాకుండా, ఢిల్లీలో దిగే విధంగా మాట్లాడి ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్కు నేరుగా వచ్చే అవకాశం లభించింది.
హైదరాబాద్లో విమానం దిగిన తర్వాత లగేజీ తీసుకొని క్షేమంగా బయటపడ్డాను. నా కోసం బయట వేచి ఉన్న నా పిల్లలను చూసి కన్నీటి పర్యంతం అయ్యా ను. అదృష్టవశాత్తు అక్కడ శాన్ఫ్రాన్సిస్కోలోను, ఢిల్లీలోనూ.. కరోనా పరీక్షల్లో నెగెటి వ్ వచ్చింది కాబట్టి, క్వారంటైన్ బారినుంచి నేను తప్పించుకోగలిగాను. అప్పటికే మా బస్తీలో రెండు మూడు కేసులయ్యాయి. బస్తీవాసులు భయం భయంగా కాలం గ డుపుతున్నారు. అన్ని కరోనా పరీక్షల నుంచి బయట పడడం వల్ల నేను క్షేమంగా ఇల్లు చేరుకోగలిగాను.
వ్యాసకర్త సెల్: 9885654381