21-06-2025 12:00:00 AM
నేడు జయశంకర్ సార్ వర్ధంతి :
డా. మెంతబోయిన సైదులు :
‘అడుక్కొని అయినా తింటం కానీ ఆంధ్రోళ్లతో కలిసి ఉండం” అని ఫజల్ అలీ కమిషన్కు బరాబర్ తెగేసి చెప్పిన నికార్సయిన తెలంగాణ మట్టిమనిషి. ఢిల్లీనుంచి గల్లీవరకు సమావేశం, సభ, ధర్నా, రస్తా రోకో.. ఏం జరిగినా తాను మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు అవసరం గురించి మాత్రమే. పలుచనైన తెలంగాణ ఉద్యమాన్ని చిక్క పరిచిన వ్యక్తి ఆయన. జీవితాంతం బ్రహ్మచారిగానే బతికిన ఆ మహెూద్యమ కెరటం పేరు ఆచార్య కొత్తపల్లి జయశంకర్.
“రాష్ట్ర సాధనకు జెండాలు లేవు, ఎజెండాలు మాత్ర మే” అని చెప్పి ప్రతి పార్టీ ఇంటి గడప తొక్కి, బొట్టుపెట్టి, మరీ బతిమాలిన మహనీయుడు. “కన్నుల్లో ఆవేశం ఉన్నా, నా గుండెల్లో బాధ ఉన్నా, ఆధిపత్య శక్తులను ఎదుర్కోవాలంటే అవన్నీ మర్చిపోయి రాజ్యాంగ బద్ధంగా మనకు రావాల్సిన నీళ్లు నిధులు తెచ్చుకోవాలని చెప్పారాయన. “పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో కోట్లాట లేదని, పొట్ట కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీదనే పంచాయతీ” అని కుండబద్దలు కొట్టి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఖండాంతరాలలో వ్యాపింపజేసిన మనసున్న మారాజు. నాలుగున్నర కోట్ల గొంతుల ఉద్యమ నినాదం తాను! అణచివేతకు గురైన ఆకాంక్షలకు ప్రతిరూపం ఆయన. కన్నీళ్ళను, కష్టాలను, కడుపులో దాచుకుని తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ఆశగా, ఆశయంగా, లక్ష్యంగా, జీవితంగా బతికి, భావజాల వ్యాప్తి చేసిన దార్శనికుడు.
తల్లిదండ్రులు, ముగ్గురు అన్నదమ్ము లు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ఒక అనాధను చేరదీసి, విద్యాబుద్ధులు చెప్పించి, ప్రయోజకుల్ని చేసి మరొక అనాధ అమ్మాయిని పెళ్లి చేసి వారిద్దరికీ పుట్టిన బిడ్డను ఎత్తుకుని ఆడించి ఆనందపడిన గొప్ప హృదయం ఆయనకు కాక మరెవరికి ఉంటుంది! ఆయనలోని ఈ నిబద్ధత, మానవీయత మరెవరిలోనూ మనకు కానరావు.
నికార్సయిన ప్రజాస్వామ్య వాది!
అధిక సంఖ్యాకుల క్రౌర్యం నుంచి అల్ప సంఖ్యాకులను కాపాడాలనే అంబేద్కర్ వాదాన్ని శిరసావహించాలని చెప్పిన నికార్సయిన ప్రజాస్వామ్యవాది ఆయన. సార్ అనే పదం లేకుండా జయశంకర్ సార్ను పిలవలేం. అది ఆయనకు తెలంగాణ సమాజం ఇచ్చే గౌరవం. ఆ హోదాను విడదీసి చూడలేం. జయశంకర్ సార్ని అలా పిలవడం వల్ల సార్ అనే పదానికే ఔన్నత్యం పెరిగిందని చెప్పాలి. మనసా, వాచా, కర్మణా ఆచరించి అదే నిబద్ధతను చూపిన, తెలంగాణ అస్తిత్వ పతాక ఆచార్య జయశంకర్.
1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మికాంతారావు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించారు జయశంకర్ సార్. ఉర్దూ మీడియంలో ఉన్న హనుమకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య, హన్మకొండ న్యూ హైస్కూల్లో మాధ్యమిక విద్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. ఉస్మాని యా విశ్వవిద్యాలయంలో బీఏ చేశారు. ఎంఏతోపాటు ఎకనామిక్స్లో పీహెచ్డ్ సాధించారు. సమస్యలపట్ల ఏ విధంగా స్పందించాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
క్షణక్షణం తపించిన హృదయం
‘వరంగల్లో డిగ్రీ కాలేజీ లేదు’ అని ధర్నాలు చేసి, ఉద్యమించిన విద్యార్థుల మొదటి వరుసలో ఉన్న జయశంకర్ సా ర్, పొరపాటున వరంగల్కు డిగ్రీ కాలేజ్ అని కాకుండా యూనివర్సిటీ కావాలని నినదించారు. అది పొరపాటు కాదని ఆ తర్వాతి కాలంలో రుజువైంది. 1952లో తెలంగాణ ఉద్యమంలో ఇంటర్మీడియట్ దశలోనే ‘జై తెలంగాణ’ నినాదం చేసి తరగతి గదినుంచి బహిష్కరణకు గురయ్యా రు.
అప్పటి నుంచి తాను మరణించే వర కు తెలంగాణ పదాన్ని వీడి ఎన్నడూ లేరు. ‘నాన్ ముల్కీ గోబ్యాక్’ నినాదాలతో హైదరాబాద్ మీటింగ్లో పాల్గొనడానికి బయ లుదేరిన బస్సు ఫెయిల్ అవడంతో పోలీ సు కాల్పుల నుంచి తప్పించు కున్నట్టు అయ్యింది. జయశంకర్ సార్ మిత్రులు ఆ రోజు పోలీసు కాల్పుల్లో చనిపోయారు.
“ఇన్ని ఘోరాలు చూడడానికేనా ఇంకా బ్రతికి ఉన్నాను. ఆ కాల్పుల్లో చనిపోయే అదృష్టం నాకు దక్కక పొయ్యే” అని ఎన్నో మీటింగ్లలో ఆయన ప్రత్యక్షంగా బాధ పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తౌరక్యాంధ్రమనీ తురకల భాష అని ఎగతాళి చేసిన అయ్యదేవర కాళేశ్వరరావు మీటింగ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఫలితంగా లాఠీ దెబ్బలు తిన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి, శ్రీశ్రీ వంటి వారి కవిత్వంలో ఉర్దూ పదాలను చూపి, వారి కళ్ళు తెరిపించిన సాహితీవేత్త జయశంకర్ సార్. తెలంగాణ చరిత్రను ఊహించని రీతిలో పూర్తి వివరాలు సేకరించి విశ్లేషణలతో ముందుంచి అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించారు.
“తెలంగాణ విశాలాంధ్ర అయి న తర్వాత దాశరథిని, ఎన్టీఆర్ ఏపీ ఆస్థానకవి పదవి నుంచి తొలగించి చాలా తప్పు చేశారని, పరోక్షంగా ఆ మహాకవిని మానసిక క్షోభకు గురి చేశారని ఎన్నో వేదికలమీద ప్ర సంగిస్తూ చెప్పారు. ‘రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు రావాల్సిన నీటి వాటాను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని, తెలంగాణకు వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని’ కృష్ణా బోర్డుకు ఆనాడే చెప్పారు.
ఆరాటాలు, పోరాటాలే శ్వాసగా..
ఆచార్య జయశంకర్ సార్ స్టూడెంట్గా ఉన్నపుడు ‘ఇడ్లీ సాంబార్ గోబ్యాక్’ అన్నా రు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ‘నాన్ ముల్కీ గోబ్యాక్’ అన్నారు. లెక్చరర్గా ఉన్నప్పుడు ‘వలసాంధ్ర పెత్తనం గోబ్యాక్’ అన్నారు. ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ‘ఆత్మగౌరవం కావాలన్నారు’. వీసీగా ఉన్నప్పుడు ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అన్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ప్రత్యేక తె లంగాణ ఉద్యమంలో ఉప్పొంగిన ఉడుకు రక్తంతో యువతరం ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు జయశంకర్ సార్.
తెలంగాణ సాధ న మొత్తం ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగానికి లోబడే జరగాలని, ఏ విధమైన హింస చోటు చేసుకోవద్దని గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన. “మొదటిది భావజా ల వ్యాప్తి, రెండోది ఆందోళన కార్యక్రమం. ఇవి ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం కన్న కలల్ని సాకారం చేసుకోగలుగుతాం” అని ప్రబలంగా నమ్మేవారు జయశంకర్ సార్.
1960లో ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా, 1975 వరకు, సీకేఎం కాలేజీలో ప్రిన్సిపల్గా, 1982- వరకు ఇఫ్లు రిజిస్ట్రార్గా, 19-94 వరకు కాకతీయ యూని వర్సిటీ వీసీగా ఎన్నో పదవులను అలంకరించినా ఎప్పుడూ తనకు కేటాయించిన గదిలో ఉండి తానే వంట చేసుకుని తింటూ, అతిసాధారణ జీవితం గడిపిన మహామేధావి జయశంకర్ సార్.
తెలంగాణ కోసం టీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఎవరితోనైనా కలిసి పని చేయడాని కి సిద్ధమని చెప్పి, ఎవరు మీటింగ్ పెట్టినా వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పేవారు. జయశంకర్ సార్ రచనలు చూస్తే ఆ శీర్షికలలోనే తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. * తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ * తెలంగాణలో ఏం జరుగుతోంది? * వక్రీకరణలు- లు * తల్లడిల్లుతున్న తెలంగాణ * తెలంగాణ (ఇంగ్లీష్ పుస్తకం).
పునరంకితమవుదాం!
మిలియన్ మార్చ్ వేళ జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని ఆయన సమర్థించారు. తెలంగాణ కవులు, నాయకుల విగ్రహాలు లేకపోవడం దురదృష్టకరమని బాధ పడ్డారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష కు వచ్చిన తెలంగాణ ప్రకటనను నాటి హోం మంత్రి చిదంబరంకు ప్రత్యక్షంగా మాట్లాడి అనౌన్స్మెంట్ ఏ విధంగా తప్పులేకుండా, పొరపాటు జరగకుండా చెప్పా లో రాసి ఇచ్చింది జయశంకర్ సార్ అనే విషయం ఎంతమందికి తెలుసు! “పుట్టుక నీది, చావు నీది.
బతుకంతా తెలంగాణది” అని తెలంగాణ కోసం అహర్నిశలు పరితపించిన జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పాటు జరగక ముందే 21 జూన్ 2011న క్యాన్సర్తో ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. తను లేకపోయినా తను కలలుగన్న సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు జరిగితేనే ఆ మహనీయుని ఆత్మ శాంతిస్తుంది. అదే ఆయనకు తెలంగాణ సమాజం అర్పించే నిజమైన నివాళి.
వ్యాసకర్త సెల్: 9010910956