calender_icon.png 27 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలు వాడకం ప్రమాదకరం

27-06-2025 12:54:58 AM

  • మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దు
    • డ్రగ్స్ మహమ్మారిని తరిమికోడదాం
    • డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం
    • మత్తు పదార్థాల వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలి: మంత్రి సీతక్క.

ములుగు, జూన్26(విజయక్రాంతి): యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో  అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నకు రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి  అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు వ్యాపారాత్మక ధోరణిలో పసి పిల్లలకు చాకోలెట్స్ రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేయించి ఆ మత్తులోకి లాగేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీన్ని సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతుందని అన్నారు.

యువత డ్రగ్స్ కి అలవాటు కావడం వలన వారి నిండు భవిష్యత్తు చీకటిలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. రాష్ట్రం లో కానీ, దేశంలో కానీ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల పై కూడా అత్యంత క్రూరంగా  జరుగుతున్న లైంగిక దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నవారే అధికంగా ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం చేయడం వల్ల కుటుంబాలు నాశనం కావడమే కాకుండా ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతి యువకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలు వాడకం చేయడంలో దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వాడకం  వలన జరిగే అనారోగ్య సమస్యలపై యువత అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో యాంటీ డ్రెస్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, దీని వాడకం చేయడం వలన జరిగే నష్టాలపై సంబంధిత శాఖల అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో  ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

హనుమకొండ, జూన్ 26 (విజయ క్రాంతి): మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన సమాజానికి కలిగే అనర్థాలను గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్  పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, పోలీస్, తదితర ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన పై వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సిసి కేడేట్లతో నక్కలగుట్ట నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ర్యాలీ అదాలత్ సర్కిల్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పాఠశాలల నుండే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు  చెబుతున్నాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకునే చర్యలతోనే మత్తు పదార్థాల నియంత్రణకు వీలుకలుగుతుందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ  మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలన్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి...

జనగామ, జూన్ 26(విజయక్రాంతి): గురువారం  జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం  పురస్కరించుకొని  చౌరస్తా లో ఏర్పాటు చేసిన ర్యాలీని డిసిపి రాజమహేంద్ర నాయక్ ఏ.ఎస్.పి. పండరి నితిన్ చేతన్  కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్  పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా బస్టాండ్ చౌరస్తా లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నెహ్రూ చౌక్ మీదుగా కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం జాగృతి పోస్టర్ ని ఆవిష్కరించారు. విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ పై మత్తు పదార్థాల పట్ల విరక్తిని కలిగించేలా వీడియోలను ప్రదర్శించి అవగాహన పరిచారు. డ్రగ్స్ వ్యతిరేక సంతకాల ప్రచారం, డ్రగ్స్ కు నో  జీవితానికి ఎస్ అనే నినాదం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. యువత డ్రగ్ రహిత సమాజం కొరకు ఉద్యమంలా పోరాడాలని, ప్రతి విద్యార్థి యుద్ధ సైనికుడుగా సమరం సాగించాలని పిలుపునిచ్చారు. 

డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణలో పోలీసు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ పై అవగాహన పొందాలని తద్వారా డ్రగ్ రహిత సమాజాన్ని చూడగలుగుతామన్నారు. విద్యార్థుల అవగాహన కొరకు వ్యాసరచన,  చిత్రలేఖనం పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.  తదనంతరం గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ అధికారిని ఫ్లోరెన్స్, జిల్లా వైద్య శాఖ అధికారి మల్లికార్జునరావు, పోలీస్ శాఖ అధికారులు, సైకాలజిస్టులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరి కృషి అవసరం 

మహబూబాబాద్, జూన్ 26 (విజయ క్రాంతి): మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై అప్రమత్తంగా ఉంటూ నిరోధానికి సంఘటిత కృషి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎక్సైజ్ సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. 

భూపాలపల్లి లో..:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్.రమేష్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్సార్. దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జీ.అఖిల, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.