తెలంగాణవ్యాప్తంగా 'ఈగల్ ఫోర్స్' ఆపరేషన్.. 14 మందికి డ్రగ్ పాజిటివ్
మాదకద్రవ్యాల వినియోగంపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం
హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో తెలంగాణ మాదకద్రవ్య నిరోధక బ్యూరోకు చెందిన ఈగల్ ఫోర్స్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఆపరేషన్ చేపట్టింది. 14 మంది డ్రగ్స్ వినియోగదారులను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. గోవాలోని వాగేటర్ బీచ్ వద్ద హాస్టల్ లీజుకు తీసుకుని డ్రగ్స్ దందా నడుస్తోంది.
చక్రపాణి, హర్షిద్ రెడ్డి , సుశీల్ కృష్ణ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్స్ ఫోర్స్ కు సమాచారం అందింది. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి గోవాలో సేవిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ముగ్గురు నిందితుల నుంచి 44 మంది వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన 14 మందిని ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ కోసం చక్రపాణి, హర్షిద్ రెడ్డికి నగదు పంపినట్లు తెలింది. చక్రపాణికి రూ. 1.46 లక్షలు, హర్షిద్ రెడ్డికి రూ. 1.66 లక్షలు పంపినట్లు అధికారులు గుర్తించారు. చక్రపాణి, హర్షిద్ రెడ్డిపై గతంలో వనస్థలిపురం, మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. చక్రపాని అలియాస్ చక్రి, హర్షిద్ రెడ్డి నడుపుతున్నట్లు ఆరోపించబడిన డ్రగ్ సరఫరా నెట్వర్క్కు సంబంధించి ఈగల్ ఫోర్స్ టోల్-ఫ్రీ వాట్సాప్ హెల్ప్లైన్ ద్వారా అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






