24-06-2025 12:00:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, జూన్ 23: మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు, హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలల్లో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీ నిల్వ ఉంటే జెసిబి ని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు వారి మండలంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ముళ్ళ పొదలు, చెత్తాచెదారం లేకుండా చూడాలని, విద్యార్థులు విష పురుగులు,క్రిమి కీటకాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, మూసీ పరీవాహక ప్రాంతంలో విష పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ‘స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ- 2025‘ గోడపత్రికను ఆవిష్కరించారు. కాగా ఈ సోమవారం ప్రజావాణిలో మొత్తం 129 దరఖాస్తులు రాగా, అందులో జిల్లా అధికారులకు 57, రెవెన్యూ శాఖకు సంబంధించి 72 దరఖాస్తులు వచ్చాయి. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ , డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జెడ్ పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాస రావు, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు , ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు .