భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి
- యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్రావు
యాదాద్రి భువనగిరి, జూన్ 22 (విజయక్రాంతి): భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి ఆల య ఈవో ఏ భాస్కర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: నిర్మాణం తర్వాత భక్తులకు విష్ణుపుష్కరిణి, అన్నదానం, వ్రత పూజలు, వాహన పూజలు, కల్యాణ కట్ట వంటి సదుపాయాలను కొండ కిందనే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, భక్తులకు సదుపాయాలను అందించే విభాగాల పనితీరును తెలుసుకునేందుకు ఆలయ ఈవో ఏ భాస్కర్రావు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్న ప్రసాదం తయారీలో నాణ్యత, శుభ్రత పాటించాలని అన్నదానం విభాగం అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై తెలుసుకున్నారు. ఈవో వెంట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దయాకర్రెడ్డి తదితరులు ఉన్నారు.
- ఆలయ అధికారి సస్పెండ్..
యాదాద్రి దేవస్థాన లీగల్ విభాగం సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఏ సత్యనారాయణ శర్మను సస్పెండ్ చేస్తూ ఈవో భాస్కర్రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవడం, కోర్టు కేసులు, ఇతర ఫైల్స్ నిర్వహణలో జాప్యం చేయడం కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.






