17 April, 2026 | 3:29 AM

ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

17-04-2026 01:34 AM

అధికారులతో సమీక్షించిన జగ్గారెడ్డి, నిర్మల

సదాశివపేట, ఏప్రిల్ 16 : సదాశివపేట పట్టణంలోని ప్రతీ ఇంటికి రోజూ గంటన్నర పాటు మంచినీళ్లు సరఫరా చేసేలా ప్రణాళిక సిద్దం చేయాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. సింగూరు డ్యామ్ నుండి నేరుగా ఇంటింటికి మంజీర నీళ్లు అందేలా ఇంటెక్ వేల్, ఫిల్టర్ బెడ్, ట్యాంకులు, కొత్త పైపులైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. సదాశివపేటకు ప్రతిరోజూ గంటన్నర నీళ్లు ఇవ్వాలంటే రూ.135 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు.  60 వేల జనాభాకు ప్రతిరోజూ 21 లక్షల గ్యాలెన్ల మంచినీళ్లు అవసరం కాగా కొత్తగా నిర్మించే వాటర్ స్కీమ్ లో 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. 50 సంవత్సరాల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో ఈ స్కీమ్ ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. ఈనెల 17న వాటర్ ప్రాజెక్టు గురించి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్ల అభిప్రాయాలు, వారి వార్డుల్లో సమస్యలను నమోదు చేసుకోవాలని సూచించారు. 18వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకోవాలని, 19న సదాశివపేట ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలన్నారు.  అదేరోజు రాత్రి ఫైనల్ రిపోర్టు ను నాకు, నిర్మలకు అందిస్తే మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తానని తెలిపారు. ప్రాజెక్టు విలువ రూ.135 కోట్లు అంచనా వేసినప్పటికీ ప్రజాభిప్రాయం ఆధారంగా  ఆ విలువ పెరిగినా ఇబ్బంది లేదని సూచించారు. వాటర్ స్కీమ్ కు ఆమోదం రాగానే టెండర్లు పిలిచి రెండేళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.