25 February, 2026 | 10:44 PM

ఈద్గా దర్గా రోడ్డు పున:ప్రారంభం

25-02-2026 09:09 PM

నవాబుపేటలో 26 ఏళ్ల కల సాకారం

నవాబుపేట: మండల కేంద్రంలో దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. మండల కేంద్రంలోని మరికల్ రోడ్డు నుండి ఈద్గా దర్గా (ప్రార్థన మందిరం) స్మశానవాటిక వరకు ఉన్న రోడ్డును బుధవారం అధికారికంగా పునర్ ప్రారంభించారు. సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో సి.సి. రోడ్డు నిర్మించే క్రమంలో ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు, అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించి, పక్కనే ఉన్న వెంచర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ భూమిలో కాంపౌండ్ వాల్ నిర్మించారు.

అప్పట్లో స్థానిక నాయకుల చొరవతో సొంత నిధులతో మొరం  పోసి తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించారు. చాలా కాలంగా వాడుకలో లేక, కేవలం సంవత్సరానికి ఒకసారి ప్రార్థనల సమయంలో, అంత్యక్రియల సమయంలో మాత్రమే ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రోడ్డును పునర్ ప్రారంభించడం పట్ల స్థానిక ముస్లిం సోదరులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జేక ట్రస్ట్ ఛైర్మన్ నర్సింహ చారి, సర్పంచ్ గీతా రాణి,ఉప సర్పంచ్ ఎండీ అజార్ అలీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.