06-06-2025 11:21:20 PM
దౌల్తాబాద్: అనారోగ్య సమస్యల వెంటాడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మన్నె గోపయ్య (70) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థలోని వీఆర్ఏ ఉద్యోగాలను తొలగించడంతో తరచూ బాధపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ రెండు సమస్యల విషయంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల గ్రామాలు, బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ గోపయ్య ఆచూకీ లభించలేదు. శుక్రవారం గ్రామంలోని చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మన్నె సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.