07-06-2025 12:00:00 AM
సంస్థ సీఎండీ ఎన్ బలరాం
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఉద్యోగుల భరోసా కోసం అమలు చేస్తున్న రూ.కోటి ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన మణుగూరుకు చెందిన ఈపీ ఆపరేటర్ మూల్చంద్ విశ్వకర్మ సతీమణి హరిదేవికి శుక్రవారం కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో రూ.కోటి చెక్కు అందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి సీఎండీ బలరాం మాట్లాడుతూ.. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థల్లో లేనివిధంగా సింగరేణి సంస్థ తొలిసారిగా బ్యాంక్ వారితో మాట్లాడి గరిష్ఠంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. సింగరేణిలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని అసోం, యూపీ తదితర రాష్ట్రాలతోపాటు కోల్ ఇండియా కూడా అమల్లోకి తీసుకోచ్చిందన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల వరకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో జీ 15 గ్రేడ్ బొగ్గును థర్మల్ విద్యుత్తు కేంద్రాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, అందుకే అన్ని ఏరియాల్లో జీ 13 గ్రేడ్ బొగ్గును సిద్ధం చేసి, రవాణా చేయాలని సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్కువ గ్రేడ్ బొగ్గును తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపకపోవటంతో సంస్థకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.