04-12-2025 12:00:00 AM
సూర్యాపేట జిల్లాలో ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు ఎస్పీ కొత్తపల్లి నరసింహ
హుజూర్ నగర్ / నేరేడుచర్ల, డిసెంబర్ 3: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఐపియస్ పిలుపునిచ్చారు.బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ. .. ఎన్నికలలో ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అభ్యర్థులు మద్యం, డబ్బులు, ప్రోత్చకాలతో ఓటర్లను మభ్యపెడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యత తో ఉంచుతామన్నారు. ఎన్నికలలో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా చూడాలని.
ఎన్నికల సమయంలో కేసులు నమోదు కావడం మూలంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించు కోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్పీ హెచ్చరించారు.యువత అనవసర గొడవలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోకూడదని, ఒక కేసు నమోదైనా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని సూచించారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఓటరు క్యూ లైన్ను కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, యస్ఐ రవీందర్ నాయక్, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలి: కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి కోరారు.బుధవారం హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ యస్ఐ బండి మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.