17-02-2026 12:00:00 AM
అదివాసీ యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆ వర్గం మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందకపోవడం, మధ్యలోనే చదువు ఆపేయడం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోంది. నిరుద్యోగం, సరైన ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల యువత అసహనానికి గురై పెడదోవ పడుతున్నారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలకు త్వరగా బానిసవ్వడం వల్ల ఆరోగ్యం, సామాజిక గౌరవం కోల్పోతున్నారు.
ఆధునిక పోకడల ప్రభావంతో తమ మూలాలను, విలువలను మరిచిపోవడం వల్ల వ్యక్తిత్వ లోపాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదివాసీ యువతకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. చైతన్య కార్యక్రమాలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగించాలి.
యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి క్రీడలు, కళల వైపు వారిని ప్రోత్సహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ పథకాలతో పాటు, చదువుకున్న ఆదివాసీ యువకులు తమ దృక్పథం మార్చుకునేందుకు ముందుకు రావాలి. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీని, విక్రయాలను అరికట్టడానికి పోలీసులు, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరించాలి.
వూకే రామకృష్ణ, ఆదిలాబాద్