17-02-2026 12:00:00 AM
నగర శివారు ప్రాంతాలకు ఆర్టీసీ సిటీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేదు. దీంతో బస్సుల కొరత ప్రజారవాణాకు సవాల్గా మారింది. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న వందల కొద్దీ కాలనీలకు ప్రజారవాణా సదుపాయం అరకొరగా ఉంది. మరోవైపు ప్రయాణికుల రద్దీ ఉన్న రూట్లలో డిమాండ్ మేరకు బస్సులు లేవు.
బస్టాపుల్లో ప్రయాణికులు చాలాసేపు పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటకు ఒక బస్సు కూడా అందుబాటులో ఉండటం లేదని, ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సులో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ)పై హెఎండీఏ ఏర్పాటు చేసిన లీ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం సుమారు 7,250 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్థుల భవనాలు విస్తరిస్తున్నాయి.
నగర జనాభా సైతం 2 కోట్లకు చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాల మేరకు రవాణా సదుపాయాలు పెరగాల్సి ఉండగా ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు రెండు, మూడో దశలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో మాత్రం రెండో దశలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2050 నాటికి 665 కి.మీ.లకు పైగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న జనాభా మేరకు కనీసం 10 వేల పర్యావరణహిత బస్సులు అవసరం.
కానీ, 2,800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 250 -మాత్రమే. ఇప్పటికిప్పుడు ప్రయాణికుల డిమాండ్ మేరకు 6 వేల బస్సులను సమకూర్చాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఉన్న బస్సులు, ట్రిప్పులతో 20 లక్షల మందికి కూడా సేవలు లభించడం లేదు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత డిమాండ్ పెరిగింది. వెంటనే శివార్లకు బస్సుల సంఖ్యను పెంచాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్