21-02-2026 02:10:37 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుందని యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే మహత్తర సాధనం క్రీడలే అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సీఎం కప్2025 పోటీలు (బాక్సింగ్ & నెట్బాల్) ఘనంగా ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన, సహనశక్తి వంటి విలువలను పెంపొందించే సాధనమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్2025 పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికగా నిలుస్తాయని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, స్పోరట్స్ యునివర్సిటీని సైతం ఏర్పాటు చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణా సౌకర్యాలు, ప్రోత్సాహక పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అంతేకాదు, క్రీడలు యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడతాయని అన్నారు. క్రీడా రం గంలో యువత మరింతగా ముందుకు రావాలని, గెలుపు, ఓటములను సమానం గా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించా లని సూచించారు.
భవిష్యత్తులో జిల్లా స్థాయిలో మరిన్ని జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో మేయర్ జి. మమత శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కార్పోరేటర్లు ఉమర్ కొత్వాల్, సిబి శ్రీపూజి, టి.రమేష్ బాబు, నాయకులు సిజె బెనహర్, గోపాల్ యాదవ్ డివైఎస్ఓ శ్రీనివాస్, క్రీడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.