12-06-2025 11:03:33 PM
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పుడేమో నేనే ఇంజనీర్.. నేనే మేస్త్రి నేనే అన్ని అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అరెస్టు అవుతానని భయంతో నాకు ఏమీ సంబంధం లేదని జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట చెప్పడంతో ఇప్పటివరకు ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని స్పష్టమైనట్టు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు(CPI State Assistant Secretary Takkalapalli Srinivasa Rao) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీరభవన్లో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో కెసిఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నారన్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఒరుగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాస్ చార్జీల పెంపు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలు దోచుకుంటున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని నియమించి విద్య వ్యవస్థను గాడిలో పెట్టాలన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి మాట్లాడుతూ సిపిఐ మూడవ జిల్లా మహాసభలు జూలై 5,6న కొరివి మండల కేంద్రంలో జరుగుతున్నాయని వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, కట్లోజు పాండురంగ చారి, చింతకుంట్ల వెంకన్న, వరిపల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి , నెల్లూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.