calender_icon.png 14 June, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచంపల్లి ‘ఇక్కత్’ ఒక కళ

13-06-2025 01:30:00 AM

  1. పుస్తకాల్లో చదివిన కళాకారులను స్వయంగా చూస్తున్న
  2. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
  3. భూదాన్ పోచంపల్లిలో పర్యటన
  4. చేనేత కార్మికులతో ముఖాముఖి

యాదాద్రి భువనగిరి, జూన్ 12 (విజయక్రాంతి): పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ అ ని, గుర్తింపుకు చిహ్నం అని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత ఉత్పత్తులను పోచంపల్లి టూరిజం టెక్స్‌టైల్ పార్కులో పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడారు. వారి స్థితిగతులు, సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం టెక్స్ టైల్స్ పార్కు సమావేశ మందిరంలో నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చేనేత అనేది ఒక కళ అని, ప్రత్యేకించి పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని, ఇటీవల ప్రపంచ సుందరీమణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలియడం సంతోషమని అన్నారు. పోచంపల్లి ఇక్కత్  ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారో తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని,  గతంలో పోచంపల్లి చీరలపై పుస్త కాల్లో మాత్రమే చదివానని, ఇప్పుడు స్వయంగా చూడటం మంచి అనుభవం అని అన్నారు.

పో చంపల్లి గ్రామంలో చేనేతలో చాలామంది నిష్ణాతులు ఉన్నారని, ఆఫ్ సిల్క్, కాటన్  వంటి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, భవిష్యత్తులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. అయితే పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు, మార్కెటింగ్ తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐటి, ఐఐటి సహకారంతో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రత్యేకించి మార్కెటింగ్, డిజైనింగ్ ,డయింగ్  అన్ని విషయాల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కత్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంతేకాక నకిలీ ఇక్కత్ సమస్యను కూడా నేత కార్మికులు చెబుతున్నారని, ఈ రెండింటిని గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

నేత కార్మికులకు ఉన్న సమస్యలు చాలా చిన్నవని, వాటిని సులభంగా పరిష్కరించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉపేందర్, భాగ్యలక్ష్మి, యాదగిరి అనే నేత కార్మికులకు నేతన్న రుణాల కింద రూ.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

నేతన్న పొదుపు పథకం కింద యాదాద్రి జిల్లా మొత్తానికి రూ.2.15 కోట్ల చెక్కును నేత కార్మికులకు అందజేశారు. చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని చెప్పారు. త్రిఫ్ట్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్, రుణమాఫీ, నేతన్న భరోసా, వంటి పథకాల ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. వారివెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు ఉన్నారు.