పరీక్షా సోపానం
విద్యార్థులు ఈ పరీక్షల సీజన్లో కంగారు పడకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకొని చదవడం ప్రారంభిస్తే సత్ఫలితాలు తప్పక సాధిస్తారు. అనవసర ఆలోచనలు ఏకాగ్రతను మింగేస్తాయి. సబ్జెక్టుల వారీగా ప్లాన్ చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో చదవండి. ముందుగానే స్వయం పరీక్షలు రాయాలి. గంట లేదా రెండు గంటలకు ఒకసారి స్వల్ప విరా మం తీసుకోవాలి.
ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. చదవడాన్ని వాయిదా వేయవద్దు. ముఖ్య పాఠ్యాంశాలను అండర్లైన్ చేసుకోవాలి. గ్రాఫ్లు, లెక్కలు, డయాగ్రామ్స్, సూత్రాలు, సమీకరణాలు లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ‘ఒకసారి రాస్తే పదిసార్లు చదివినట్లే’ అని తెలుసుకోవాలి. ఇష్టమైన టీచర్ లేదా సలహాదారుతో మాట్లాడండి.
కనీసం 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్లు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్లో ఒత్తిడికి గురికాకండి. మనసు తేలిక పరచుకోవాలి. సమాధానాలు రాస్తు న్నపుడు సమయపాలన పాటించండి. సహచరుల వైపు చూడవద్దు.
ఏం రాసామో, ఎలా రాసామో పేపర్ను తిరగేసి పరిశీలించండి. ఒకటి రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయకపోయినా దాని గురించి అనవసర ఆందోళన చెందితే రాబోయే పరీక్షలపై దాని ప్రతికూల ప్రభావం పడుతుందని మరువరాదు. పరీక్షల పట్ల ఆశావహ ఆలోచనలు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. తల్లిదండ్రులు పిల్లలను అనవసర ఆందోళనలకు గురి చేయవద్దు.
శక్తికి మించిన భారాన్ని మోపవద్దు. సమతుల ఆహారం ఇవ్వండి. ఇతర పిల్లలతో పోల్చడం మానేయండి. ప్రేరణాత్మక వాతావరణం కల్పించండి. మార్కులు అతిగా రావాలని ఇబ్బంది పెట్టకండి. మంచి పుస్తకాలు, చదివే వాతావరణం, ప్రశాంతత, ఏకాగ్రత పెంచే సౌకర్యాల కల్పన మరువరాదు. మన పిల్లల శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారికి మార్గనిర్దేశనం చేయండి.
డా. బుర్ర మధుసూదన్రెడ్డి






