ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీలోని నరసాయిగూడెం గ్రామంలో శుక్రవారం రైతులకు ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన సాగు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశముండటంతో పాటు పంట దిగుబడులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కాలువలు, చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లో వరికి బదులుగా కందులు, మినుములు, నువ్వులు, అలసందలు, ఆముదం, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. వరి సాగు చేసే రైతులు తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే తెలంగాణ సోనా, కేఎన్ఎం–7715, సిద్ధి రకాలను ఎంచుకోవాలని తెలిపారు.
భూమిలో తగిన తేమ ఏర్పడే వరకు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలని, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు కొనసాగితే రెండు శాతం యూరియా లేదా ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. ప్రత్తి పంటలో శనగ పచ్చపురుగు ఆశించే అవకాశం ఉన్నందున 200 లీటర్ల నీటికి క్లోరోపైరిఫోస్ 500 మిల్లీలీటర్లు లేదా ఏసీఫేట్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, ఏఈఓ గౌస్, అగ్రికల్చర్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.






