23-06-2025 10:19:15 PM
రైతు భరోసాతో రైతుల కుటుంబాలలో వెలుగులు..
ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు సంబరాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్(DCC President Kethavath Shankar Naik) కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందని అన్నారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసాతో రైతుల జీవితాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతుందని అన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 6,300 కోట్లు రైతుల ఎకౌంట్లో జమ అయిందని వెల్లడించారు. అదేవిధంగా 2,400 కోట్లు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతుందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బి ఆర్ఎస్, బిజెపి పార్టీలు జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ భూములకు మాత్రమే న్యాయం చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ మీద అబండాలు వేయడం సరైనది కాదని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు. ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బి ఆర్ ఎస్ 15 ఏళ్ల పాలనలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని. అదేవిధంగా నిరుపేదలకు ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో 20 లక్షల ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజకీయపరంగా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిందని. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మండలంలోని నాయకులు, కార్యకర్తలు రైతు సంబరాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. సందర్భంగా పాలాభిషేకాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, ఆర్టిఏ రీజనల్ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.