16 April, 2026 | 3:38 PM

రోడ్డుపై మక్కలు పోసి రైతుల నిరసన

16-04-2026 01:53 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండల రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్ ఎక్కారు. నిర్మల్ ఖానాపూర్ జాతీయ రహదారిపై కనకాపూర్ వద్ద రైతులు రోడ్డుపై మక్కలు పోసి ధర్నా చేశారు. పంట చేతికొచ్చి నెలరోజులైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఎండను సైతం లెక్కచేయకుండా గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాలతో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు