20-06-2025 12:00:00 AM
- మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి వినతిపత్రం అందజేత
ఇబ్రహీంపట్నం, జూన్ 19:రైతులందరికీ రైతు భరోసా అందించాలనీ రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి లో వినతిపత్రం అందజేసారు.
తెలంగాణ ప్రభుత్వం చివరి మూడు, నాలుగు రోజులుగా వర్షాకాలం సీజన్ పంటలకై రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయం అందించడం ప్రారంభించింది. అయితే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట, శేరిలింగంపల్లి మండలాల్లోని 48,184 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న 36,220 మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ కాలేదని అన్నారు.
తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులమేనని, వ్యవసాయం చేస్తూనే ఉన్నామని, అందువల్ల తమకు కూడా పెట్టుబడి సహాయం అందాలని వారు ప్రభుత్వానికి రైతుల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, వచ్చే 10 రోజుల్లో ఆయా మండలాలకు చెందిన రైతులకు కూడా రైతు భరోసా అందించాలనీ, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, రైతు సంఘం జిల్లా మాజీ కోఆర్డినేటర్ వంగవీటి లక్ష్మారెడ్డి , విటల్ రెడ్డి, యాచారం అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్,మాజీ ఎంపీపీ కృపేష్ , బూడిద రామిరెడ్డి , పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గరాములు తదితరులుపాల్గొన్నారు.