అండగా ఉంటాం... సహకరించాలి
ట్రంక్ లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలి..
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
ఎల్బీనగర్ : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో ట్రంక్ లైన్ నిర్మాణానికి రైతులు, స్థానికులు సహకరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(LB Nagar MLA Sudheer Reddy) కోరారు. రెండు, మూడు రోజుల క్రితం హెచ్ఎండబ్ల్యూఎస్ బీ అధికారులు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని బృందావన్ మేడోస్ కాలనీ దగ్గర డ్రైనేజీ ట్రంక్ లైన్ పనును ప్రారంభించడానికి వస్తే స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా శనివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను అడ్డుకున్న రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా రైతులు కుక్కల యాదిరెడ్డి, కుక్కల చంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. తాము డ్రైనేజీ ట్రంక్ లైన్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, గతంలోనే తమ పొలంలో నుంచి ట్రంక్ లైన్ నిర్మాణానికి ఎన్వోసీ ఇచ్చామని తెలిపారు. అయినా, బృందావన్ మేడోస్ కాలనీ సంఘం అధ్యక్షుడు శశికాంత్ దురుద్దేశంతో తమపై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే డ్రైనేజీ ట్రంక్ లైన్ నిర్మాణానికి ఏలా సహకరించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ప్రశ్నించారు. అనంఉ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అన్ని విషయాల్లో పూర్తిగా అండగా ఉంటానన్నారు. డ్రైనేజీ ట్రంక్ లైన్ నిర్మాణానికి సహకరించాలని రైతులను కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోజ్ గౌరీశెట్టి, రైతులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






