calender_icon.png 13 June, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

11-06-2025 06:15:53 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) కోరారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, ఏపీ లింగోటం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు.జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ... వారికున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేకపోతే, ఈనెల 20 వరకు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్ట ప్రకారం వెసులుబాటు ఉంటే  రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అందువల్ల వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పునరుద్ఘాటించారు.

అంతకుముందు కలెక్టర్ నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని  2 వ అంగన్వాడి కేంద్రాన్నిసందర్శించి "అమ్మ మాట అంగన్వాడి బాట" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణి స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలతో మాట్లాడి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, చిన్నపిల్లలకు పాఠశాల పూర్వ విద్యపై తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరిని తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో నమోదు చేయించాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా అంగన్వాడీలో నమోదు కావాలని, దీనిద్వారా ప్రభుత్వం వారికై ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మంచి అవకాశం అని తెలిపారు.

గర్భిణీ స్త్రీలు సమయానికి పరీక్షలు చేయించుకోవడంతో పాటు, పౌష్టికాహారం తీసుకోవాలని, లేనట్లయితే జన్యు లోపంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయని, అంతేకాక పుట్టిన తర్వాత చనిపోయేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జన్యు పరమైన లోపాలతో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మేనరికం వివాహాలు, మూఢనమ్మకాల వంటివి పాటించవద్దని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తో పాటు, ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పెళ్లయిన మహిళలు గర్భిణీ కావాలనుకున్నప్పుడు 3 నెలల ముందు నుండే ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పోషకాహారంతో పాటు, మెను లో ఎగ్ బిర్యానీ ని చేర్చడం జరిగిందని, దీనివల్ల ఆరోగ్యం బాగా మెరుగవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్న పిల్లలతో రైమ్స్ పాడించారు.జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, నార్కెట్పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరావు, సిడిపిఓ హరిత తదితరులు ఉన్నారు.