ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..
- ట్రస్ట్ పెత్తనం ఎందుకు...?
- దహన సంస్కారాలకు రూపాయి మాత్రమే ఫీజు వసూలు చేయాలి
- బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్
మంచిర్యాల అగ్రికల్చర్,(విజయక్రాంతి): ప్రజల పన్నులు, మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాల నిధుల(సుమారు రూ.10 కోట్ల)తో నిర్మించిన మంచిర్యాల మహాప్రస్థానం నిర్వహణను ట్రస్ట్ ఆధీనంలో కొనసాగించడం చట్టవిరుద్ధమని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఆరోపించారు. బుధ వారం విలేకరులతో వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ట్రస్ట్ మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
వైకుంఠధామం, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని వసతులు మున్సిపాలిటీ నిధులతో నిర్వహిస్తున్నప్పటికీ, ట్రస్ట్ పేరుతో వేల రూపాయల ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ ఆస్తిని వ్యాపార కేంద్రంగా మార్చడమేనని విమర్శించారు. మహాప్రస్థానం అధికార పార్టీ నాయకుల సమావేశాలకు వేదికగా మారిందని, దానిని పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికార పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రముఖులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రజల పన్నులతో నిర్మించిన మహాప్రస్థానంలో సాధారణ ప్రజలకు కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం కల్పించాలని, అందుకోసం దహన సంస్కారాల ఫీజును కేవలం ఒక్క రూపాయిగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు.






