18-06-2025 10:50:11 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఓ అపార్ట్మెంట్ లో ఏసీ షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన గాజులరామారం డివిజన్(Gajularamaram Division) మిథిలానగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మిథిలానగర్ లోని హిల్ టాప్ అపార్ట్మెంట్ లో ప్లాట్ నెంబర్ 101లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఏసీ షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది.
దట్టంగా పొగలు వ్యాపించడంతో అపార్ట్మెంట్ లోని 20 ప్లాట్లలో దాదాపు 60 మంది టెర్రస్ వద్దకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో కూకట్పల్లి అగ్నిమాపక అధికారి జగన్ మోహన్ వెంటనే స్పందించారు. తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. టెర్రస్ దగ్గర ఉన్న వారిని సురక్షితంగా కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ సిటీలోని జరిగిన అగ్నిప్రమాదం మరువకముందే ఈ అగ్నిప్రమాదం జరగడంతో అపార్ట్మెంట్ లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.