24-06-2025 01:10:28 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగో రోజు ఏసీబీ విచారణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. సోమవారం విచారణలో భాగంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో భారీగా నగదును గుర్తించిన ఏసీబీ అధికారులు, దాదాపు రూ.5 కోట్ల విలువైన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నూనె శ్రీధర్ను అరెస్టు చేసిన అనంతరం ఏసీబీ అధికారులు నాలుగు రోజులుగా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో శ్రీధర్ ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగులోకి రాగా, ఇప్పుడు బ్యాంక్ లాకర్లలో భారీగా నగదు బయటపడటం గమనార్హం. ఈ విచారణలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
నూనె శ్రీధర్ ఏడాది క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయినా కూడా ఆయన అక్కడే తన విధులు కొనసాగిస్తున్నట్టు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. బదిలీ ఆదేశాలు ఉన్నప్పటికీ శ్రీధర్ అక్కడే ఎందుకు పనిచేశారు.. దీని వెనుక ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి.. ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా.. అనే కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ ప్రాజెక్టులో జరిగిన భారీ అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ నివేదిక స్పష్టమైన ఆధారాలను అందించిన నేపథ్యంలోనే ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసిందని తెలుస్తోంది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు, ఇప్పుడు శ్రీధర్ కేసులో బయటపడుతున్న విషయాలు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా అనే కోణంలో ఏసీబీ అధికారులు కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది.