calender_icon.png 24 June, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అధికారుల అక్రమార్జన

24-06-2025 01:21:17 AM

- ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న అవినీతిపరులు

- ఆరు నెలల్లోనే 123 ఏసీబీ కేసులు 

- రూ.97.42 కోట్ల విలువైన అక్రమాస్తులు జప్తు

- రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల్లోనే అధికం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ర్టంలో అవినీతి అధికా రుల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండ పోతున్నది. అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణపై దృష్టి సారించకుండా అక్రమాస్తుల పెంపుదలో పోటీ పడుతున్నారు. గత ఏడాది మొత్తంగా 152 ఏసీబీ కేసులు నమోదవగా.. ఈ ఏడాది గత ఆరు నెలల వ్యవధి లోనే ఏసీబీ ఏకంగా 123 కేసులను నమోదు చేయడం గమనార్హం. నిత్యం రాష్ట్రంలో ఎక్క డో ఒకచోట అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు.

అవినీతి కేసుల్లో చిక్కిన వారిలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అక్రమ ఆస్తులు సమకూర్చుకున్న సందర్భాలు సాధారణంగా మారిపోయాయి. ఉన్నతాధికారులైతే వందల కోట్ల అక్రమాస్తులతో దర్జాగా జీవిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఎంత సంపాదించావు?” అనే ప్రశ్న కంటే “ఎంత వెనకేశావు?” అనే లెక్కలే ఇక్కడ ప్రధానంగా మారాయని ప్రజ లు మాట్లాడుకుంటున్నారు. 

223 మంది అరెస్టు

అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది అవినీతిపై తన దూకుడును మరింత పెంచింది. 2024లో మొత్తం 152 కేసులు నమోదైతే, ఈ ఏడాది గత ఆరు నెలల్లోనే 122 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులతో సహా మొత్తం 223 మందిని అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పటికే రూ.97.42 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర ప్రజా సంబంధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు అధికంగా నమో దైనట్లు ఏసీబీ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అవినీతి అధికారుల అక్రమార్జన ఇలా..

ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఓ అధికారి ఏసీబీ పట్టుబడగా రూ.17.73 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అదిలాబాద్‌లో ఈడబ్ల్యూఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్‌ను రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అత్యంత చర్చనీ యాంశమైన కేసుల్లో మాజీ హెఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ విషయంలో 200కు పై గా అక్రమ ఆస్తులను గుర్తించడం రాష్ర్టవ్యాప్తంగా కలకలం రేపింది.

గత ఏప్రిల్‌లో మె డ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ అనిల్ కుమార్ 30 కోట్లకు పైగా అక్రమ ఆస్తులతో ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో సబ్-రిజిస్ట్రార్ తస్లీమా మహ మ్మద్ కూడా అక్రమ ఆస్తుల కేసులో దోషి గా నిర్ధారణ అయింది. భద్రాద్రి కొత్తగూడెం లో ఓ పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్ స్పెక్టర్ లకు సంబంధం ఉన్న కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలు అవినీతి స్థాయి ని స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో భూమి రిజిస్ట్రేషన్, ఆస్తి బదిలీలు, భూ సమస్యల్లో అవినీతి ఆరోపణలు తర చూ వినిపి స్తున్నాయి. పౌర సరఫరాల శాఖ లో రేషన్ కార్డుల పంపిణీ, సబ్సిడీ పథకాల్లో అక్రమా లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. 

ఫిర్యాదుల సంఖ్య పెరిగింది

ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల అవినీతి ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ 20 ఫిర్యాదులు ఈ ఫోన్ ద్వారా వస్తున్నాయి. ఇది ప్రజల్లో ఏసీబీపై నమ్మకం పెరుగుతోందని సూచిస్తుంది. బలమైన ఆధారాలతో ఫిర్యాదులు చేయాలని ప్రజలను కోరుతున్నాం. అయితే, కేసుల కన్విక్షన్ రేటు  64శాతం తక్కువగా ఉండటం ఇప్పటికీ సవాలుగా ఉంది. దీనిని 70శాతానికి పెం చేందుకు తమ విభాగం కృషి చేస్తున్నది.

విజయ్‌కుమార్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ 

ఏసీబీకి చిక్కిన జీహెఎంసీ ఏఈ మనీషా 

జీహెఎంసీ గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా ఏసీబీ వలకు చిక్కింది. బిల్లు ప్రాసెస్ చేసి, ఉన్నతాధికారులకు పంపించడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసింది. బాధితులు ఏసీబీ ఆశ్రయించారు. ఏసీబీ సూచనతో సోమవారం బాధితులు రూ. 15 వేలు లంచం ఇస్తుం డగా మనీషాను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చిన బాధితులు మిగిలిన సొమ్ము ఇచ్చే సమ యంలో ఏసీబీకి సమాచారం ఇచ్చి పట్టించారు. అరెస్ట్ అయిన మనీషాను నాంపల్లి ఏసీబీ కోర్టులో హా జరుపరిచారు.