06-02-2026 08:44:32 PM
రూ.18,600 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం
కొల్చారం,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కూల్చారం మండలం పరిధిలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రాంపూర్ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.18,600 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో బోలా శేఖర్, కత శ్రీనివాస్, మస్కరి శ్రీశైలం, గుమ్మడి సురేష్, మ్యాకల యాదగిరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని కూల్చారం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి అక్రమ చర్యల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తప్పుదారుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.