03-07-2025 02:17:58 AM
- రేపు రాష్ట్రానికి ఖర్గే రాక
- ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణకుఏర్పాట్లు
కరీంనగర్, జూలై 2 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 4న హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశనం చేయనున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది.
ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సత్తా చాటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యక ర్తలను పార్టీ పెద్దలు అప్రమత్తం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నా యకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి గ్రా మస్థాయి నుంచి కార్యకర్తలను ఖర్గే సభకు తరలించేందుకు నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ ఇంచార్జి లుజిల్లాల్లో పర్యటించి ఈనెల 4న జరిగే సభ పై దిశా నిర్దేశం చేశారు. పార్టీని ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు నిర్మాణం చేసే దిశగా పిసిసి అడుగులు వేస్తున్న క్రమంలో జిల్లాలో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రుల ప్రత్యేక దృష్టి
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖర్గే సభకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కదిలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మన జిల్లాకి చెందిన నేతలు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించడమే కాకుండా తమ ప్రాంత పరిధి నుండి కార్యకర్తలను తరలించే దిశగా ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రెండు రోజులుగా పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి.
సభకు ఇక్కడి నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడే మకాం వేసి కార్యకర్తలను సభకు సన్నద్ధం చేస్తున్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అర్బన్ ప్రాంతం నుండి నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు కూడా పార్లమెంట్ పరిధిలోని నాయకులతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ఖర్గే సభకు కావలసిన ఏర్పాట్లకు హామీ ఇచ్చారు. మొత్తంగా ఖర్గే సభ అనంతరం గ్రామస్థాయిలో కార్యకర్తలు, నాయకులు రెట్టింపు పని చేసేందుకు సిద్ధం చేయాలని పార్టీనిర్ణయించింది.