5 June, 2026 | 4:22 PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

05-06-2026 03:17 PM

రంగారెడ్డి: గండిపేటలో ప్రభుత్వ భూమిని(Gandipet land scam) ఆక్రమించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలకు సంబంధించి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడిని(Former YCP MLA Bolla Brahma Naidu arrested) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భూ మోసానికి సంబంధించిన కేసులో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. 

నార్సింగి పోలీసులు ఆరోపిస్తున్న ప్రకారం, బొల్లా బ్రహ్మనాయుడు, ఇతరులు నకిలీ పత్రాలు, కల్పిత ప్రభుత్వ ఉత్తర్వులను (GOs) ఉపయోగించి ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కును పొందేందుకు కుట్రపన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు(Former MLA Bolla Brahma Naidu ) నకిలీ జీవోలతో రూ. 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నించాడు. గండిపేటలోని సర్వే నంబర్ 18 లోని 9.10 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్రపన్నారు. రెగ్యులరైజ్ భూమిగా నకిలీ జీవోలు సృష్టించారు. భూమి యాజమాన్య పత్రాలలో వ్యత్యాసాలను గుర్తించిన రెవెన్యూ అధికారుల ఫిర్యాదుల మేరకు ఈ కేసు నమోదైంది. నకిలీ రికార్డుల తయారీలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురు వ్యక్తుల పాత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు.

గండిపేటలో రూ.1500 కోట్ల భూకబ్జాకు యత్నం

ప్రభుత్వ భూమి(Government land) అని తెలిసే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానించారు. తహశీల్దార్ శ్రీనివాస్(Tahsildar Srinivas) ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ జీవోల తయారీకి బొల్లా రూ. 8 కోట్లు ఇచ్చారు. కీలక నిందితుడు వెల్ది రాధాకృష్ణకు రూ, 4 కోట్లు, న్యాయవాది, మరికొందరికి మరో రూ. 4 కోట్లు ఇచ్చారు. నకిలీ రెవెన్యూ పత్రాలతో భూమి సొంతం చేసుకునేందుకు యత్నించారు. ఈ ముఠా తెలంగాణలో సంబంధం లేని వ్యక్తి పేరిట పత్రాలు సృష్టించింది. కేసు నమోదైన వెంటనే బ్రహ్మనాయుడు ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యారు. బ్రహ్మనాయుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలించాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందని నిందితులుగా చేర్చిన సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ఐదుగురిని అరెస్ట్ చేశారు.