07-05-2025 12:00:00 AM
చిన్నవయసులో ఉన్నవారిని నియమించుకోవడం వల్ల సంస్థాగత సంస్కృతి వారికి త్వరగా అలవడడమేకాక ఆశయాలకు అనుగుణమైన ఫలితాలనూ సాధించ గలుగుతారు. దానివల్ల అభ్యర్థులు కూడా దీర్ఘకాలికమైన వృత్తి వికాసాన్ని పొందుతూ ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంటుంది.
నవంహి ద్రవ్యం యేన యేనార్థ జాతేన ఉపదిహ్యతే తత్తదా భూషతి ఏవమ్ అయం నవబుద్ధిః యద్యదుచ్యేత తత్తఛ్ఛాస్త్రోపదేశ మివాభి
జానాతి.. తస్మాద్ ధర్మమర్థం చాస్యోపదిశేన్నా ధర్మమనర్థంచ॥
కౌటిలీయం: (1-.17.-31) “కొత్త మట్టికుండకు ఏది (ద్రవ్యం) పూస్తే దానినే పీల్చుకుంటుంది. అదే విధంగా మంచి చెడ్డలు తెలియని కొత్త బుద్ధిగల వారికి ఏది చెపితే దానినే శాస్త్రోపదేశంగా భావిస్తారు. అందువల్ల రాజకు మారులకు (యువతరానికి) ధర్మార్థాలను మాత్రమే ఉపదేశించాలి. కాని అధర్మాన్నీ, అనర్థాన్ని ఉపదేశించకూడదు” అంటారు ఆచార్య చాణక్య. ఆంగ్లంలో ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనే సామెత ఉంది.
ఎవరినైనా ధర్మం వైపు నడిపించాలంటే చిన్నతనంలోనే వారిని తీర్చిదిద్దడం ఆరంభించాలి. ఒక సైకాలజిస్ట్ వద్దకు ఒక వ్యక్తి తన ఆరేం డ్ల కుమారుని తీసుకెళ్ళి ‘ఇతనికి ఎప్పటినుంచి నైతిక విలువలను బోధించాలి?’ అ ని అడగగా, ఆ సైకాలజిస్ట్ ‘ఈ క్షణం నుం డే ఆరంభించండి. ఇప్పటికే ఆరేళ్ల కాలాన్ని వృథా చేసారు’ అన్నాడట. పిల్లల మనసు చిన్నతనాన బోధించిన అంశాలను శాశ్వతం చేసుకోవడమే కాక ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చేందుకు త్వరగా అంగీకరించదు.
పిల్లలు సాధారణంగా కొత్త అవకాశాలను అన్వేషించేందుకు, కొత్త స్నేహాలను చేసేందుకు, నమ్మకాలను పెంచుకునేందుకు, తెలిసిన దానిని ఆచరణలో పెట్టేందుకు, భావోద్వేగాలను సమ న్వయం చేసుకునేందుకు, ఆలోచనా పరిధిని విస్తృత పరుచుకునేందుకు ఉత్సాహా న్ని చూపుతారు. అయితే, వారి ఉత్సాహానికి, పరిణతికి పరిమితులను విధించేది పెద్దవారే.
దాంతో పిల్లల మనసు కల్మశమై మంచికి దూరంగా లౌక్యం పేరుతో అధర్మాన్ని, స్వార్థాన్ని ఆశ్రయిస్తుంది. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కూడా పసిపిల్లలు నేర్చుకునేందుకు, నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సకారాత్మక సూచనలను, నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది.
విద్య, వ్యాపార, సేవ ఏ రంగమైనా సామాజిక ప్రస్థానమైనా వ్యక్తులను ఉన్నతీకరించాలంటే వారికి చిన్నతనాననే సుసంస్కారం ఇవ్వాలి. పిల్లల ఆలోచనలను, ప్రవర్తనను, అలవాట్లను ప్రభావితం చేయాలన్నా న్యాయం, ధర్మం, సత్యం, పరోపకార పరాయణత లాంటి ఉన్నత సంస్కారం వారికి అందాలన్నా, బాల్యంలోనే ఆ బీజాలు వారి మనసులో నాటా లి. వాటిని అనునిత్యం ఆచరణ ద్వారా ప్రచోదన చేయాలి. ఏనుగులకు శిక్షణ నిచ్చేవారు వాటిని చిన్నతనాననే వాటి కుటుంబం నుండి విడదీసి శిక్షణనివ్వడం జరుగుతుంది.
అలాగే సివిల్ సర్వీసులలో, ప్రభుత్వ పరిపాలనాధికారులుగా ప్రభు త్వం 21 నుంచి 32 సంవత్స రాల లోపు వారినే నియమించుకుంటుంది. దానివల్ల వారు సాధించిన అనుభవం చాలాకాలం పరిపాలనలో సేవలందించేందుకు ఉపయోగ పడుతుంది. సహజంగానే యువత రంలో సాధించాలనే తపన ఉంటుంది. కొత్తదనాన్ని ఆవిష్కరించాలనే ఉత్సాహం ఉంటుంది. సాహసంతో ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు, తెగువ ఉంటాయి.
ఆలోచనలో వేగం ఉంటుంది. నేర్చుకోవాలనే ఉత్సుకత ఉండడం మూలంగా వారికి తమ పాత్రకు అవసరమైన శిక్షణను ఇవ్వడం సులభతరం అవుతుంది. వివిధ విభాగాలలో పనిచేస్తూ సాధించిన నైపుణ్యాలు, విజ్ఞానం వారి అవగాహనా పరిమితులను విస్తృత పరుస్తాయి.
వారిలో చిగురెత్తిన నాయకత్వ లక్షణాలకు, సాధించిన అనుభవం తోడై ఏ బాధ్యతనైనా, ఎలాంటి సవాళ్లనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతను ఇస్తుంది. ఎలాంటి చిక్కు సమస్యకైనా పరిష్కారాన్ని కనుగొనే ఆలోచనా సరళి వారిలో వికసిస్తుంది. అర్థవంతమైన వారి అనుభవం భావితరాలను తీర్చిదిద్దేందుకు ఉపయుక్తమవుతుంది.
అర్హతలనుబట్టే ఎంపిక
వ్యాపార సంస్థలలో ఎంతటి ప్రభావవంతమైన నాయకుడైనా సంస్థను ఒంటరిగా నడిపించలేడు. సంస్థ అంటే నిబద్ధత, సమర్థత కలిగిన బృందం సమష్టి కార్యదక్షత. సరైన వ్యక్తులు, సరైన కార్యానికై, సరైన సమయంలో బృందం గా ఏర్పడి ఒకే లక్ష్యం వైపు నడిచినప్పుడే సంస్థ ఆశయాలు కార్యరూపంలోకి వస్తాయి. ప్రతిభ, వికాసం, ఉత్సాహం కలిగిన అభ్యర్థులను చిన్నవయసులో ఉన్నవారిని నియమించుకోవడం వల్ల సంస్థాగత సంస్కృతి వారికి త్వరగా అలవడడమేకాక ఆశయాలకు అనుగుణమైన ఫలితాలనూ సాధించ గలుగుతారు.
దానివల్ల అభ్యర్థులు కూడా దీర్ఘకాలికమైన వృత్తి వికాసాన్ని పొందుతూ ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ విభాగాలలో శిక్షణను ఇప్పించగలిగితే వారి అనుభవం సంస్థ ప్రగతికి బహుముఖీనంగా ఉపయోగపడుతుంది.
అయితే, పరిణతి లేకపోవడం వల్ల వారిలోని సహజ ఉత్సాహం ఆవేశానికి ఆశ్రయమిస్తే అనుభవ రాహిత్యం వారిని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా పురికొల్పవచ్చు. అనుభజ్ఞులైన నాయకులను మార్గదర్శకులుగా నియమిస్తూ వృత్తికి సంబంధించిన అవసరమైన శిక్షణను అందించి సహకారాన్ని ఇవ్వడం వల్ల ఉత్తమ ఫలితాలు ఆవిష్కారమవుతాయి.
అలాగని నియమించుకునే అభ్యర్థుల విషయంలో సంస్థలు తొందరపడినా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినా అనర్థాలు జరుగుతాయి. నియమించుకునేందుకు స్పష్టమైన లక్ష్యం లేకున్నా, ఉద్యోగానికి అవసరమైన అర్హతలలో స్పష్ట త లేకున్నా, ఎవరినో అనుకరించే ప్రయ త్నం చేసినా సరైన అభ్యర్థులను నియమించుకోవడం కష్టతరమవుతుంది. అలాంటి వారికి అందించిన శిక్షణ వృధా అవుతుంది.
యువత మనసు తలుపులు నేర్చుకునేందుకు తెఱచుకొని ఉంటాయి కాబట్టి, అది సులువవుతుంది. కంప్యూటర్లో ఎలాంటి ప్రోగ్రాం రాస్తే అలాంటి ఫలితమే వస్తుంది. అలాగని నిరంతరం ఇది నైతికత ఇది కాదని చెప్పనవసరం లేదు. నాయకులు నైతికతను అచరణలో చూపితే వారు దానిని అనుసరిస్తారు. అంతేకాక, కాలావధిలో అందరూ తమతమ అనుభవాలను పంచుకునే వాతా వరణం కల్పిస్తే సంస్థకు మరొక తరం ఉత్తమ నాయకత్వం అందుతుంది. వ్యవస్థలు కూడా సకాలంలో ఉత్తమ ఫలితా లను సాధిస్తాయి.