06-05-2025 12:00:00 AM
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై పశ్చిమ దేశాల వైఖరి పక్షపాతంగానే కనిపిస్తున్నది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని గట్టిగా ఖండించింది లేదు. ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పిందీ లేదు. నిజానికి ఇది అత్యాశే. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నది పశ్చిమ దేశాలు, ఆ దేశాలవల్లనే అని పాకిస్థాన్ వాస్తవాన్ని కూడా అంగీకరించింది. అలాంటప్పుడు పశ్చిమ దేశాలు పూర్తిగా భారత్కు మద్దతుగా నిలుస్తాయని ఆశించలేం.
పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై వాటి ధోరణి మొదటినుంచి ‘కర్ర విరగదు, పాము చావదు’ అన్నట్టుగానే ఉంటోంది. ఈ విషయంలో భారత్కు ఎప్పడూ నిరాశే ఎదురవుతుంటుంది. పహల్గాం ఉగ్రదాడిని మొదట ఖండించినా ఆ తర్వాత పశ్చిమ దేశాల నాయకుల తీరు సుభాషితాలకే పరిమితమైంది. ఇది భారతీయులకు ఒకింత ఆగ్రహం తెప్పించేదిగానూ ఉంది. 26 మంది టూరిస్టులను విచక్షణారహితంగా పొట్టన పెట్టుకున్న ఆ ఉగ్రవాద చర్యను కొన్ని పశ్చిమ దేశాల మీడియా ఉగ్రవాద చర్యగా చెప్పేందుకు కూడా వెనుకాడింది.
సంయమనంతో ఉండాలని, పెద్దగా మీడియా కవరేజీ ఇవ్వకూడదని అనుకోవడంలోనే పశ్చిమ దేశాల మీడియా డొల్లతనం, కపటత్వం కనిపిస్తున్నాయి. పశ్చిమ దేశాల వైఖరిని ఎండగడుతూ భారత విదేశాంగ మంత్రి కాస్త కటువుగానే మాట్లాడాల్సి వచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఇప్పుడు మాకు కావాల్సింది భాగస్వాములేకాని నీతిసూత్రాలు వల్లించేవారు కాదని జైశంకర్ తెగేసి చెప్పారు.
దక్షిణాసియా చరిత్రపై పశ్చిమ దేశాలకు అంతగా అవగాహన ఉన్నట్టు కనిపించదు. భారత్, పాకిస్థాన్లు పెండింగ్ సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పడమేగాని, పశ్చిమ దేశాలు ఎవరిది తప్పు అని తేల్చి చెప్పే వైఖరిని ప్రదర్శించింది లేదు. ఇది ద్వంద్వ ప్రమాణం కాక మరొకటి కాదు. భారత్, పాకిస్థాన్లను అవి సమానంగా పరిగణిస్తాయే తప్ప, ఉగ్రకుట్రలు చేస్తున్నదెవరు, బలవుతున్నదెవరనే విచక్షణ చూపిన పాపాన పోలేదు.
దేశ స్వాతంత్య్రానంతరం భారత్ ఎన్నడూ పొరుగు దేశాలపై యుద్ధానికి పోలేదు. రక్షణ, సార్వభౌమాధికారాలకు సవాళ్లు వచ్చినప్పుడు మాత్రమే భారత్ స్పందించింది. పాకిస్థాన్ మొదటినుంచి భారత్ను కవ్విస్తూనే ఉంది. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అయినా శాంతి మంత్రంతో భారత్ ఎప్పుడూ స్నేహహస్తాన్ని అందిస్తూ వస్తున్నది. రెండు దేశాలమధ్య సాధారణ పరిస్థితులు, శాంతి నెలకొనాలని భారత నాయకత్వం ఎప్పుడూ ఆకాంక్షిస్తూనే ఉంది.
నరేంద్ర మోదీ మొదటిసారి దేశ ప్రధాని అయినప్పుడు పాకిస్థాన్ ప్రధానిని ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపారు. అయితే, భారత్ స్నేహహస్తం అందించిన ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్ ఉగ్రచర్చలతో విఘాతం కలిగించడం ఆనవాయితీగా మారింది.
అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, భారత్తో సాధారణ పరిస్థితులను ఎన్నడూ కోరుకోలేదనేది వాస్తవం. బలూచిస్థాన్లో తిరుగుబాటును అణచి వేయడంలో పాకిస్థాన్ విఫలమైన సందర్భంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందనేది గమనించాలి.