13-02-2026 12:00:00 AM
విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో చిత్రబృందం గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను నిర్వహించింది. ఈ సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “మామూలుగా నా సినిమాల్లో పాటలు బాగుంటాయి అంటారు.
అయితే నా గత రెండు చిత్రాల్లో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇప్పుడీ సినిమాకు భీమ్స్ అన్నీ మంచి పాటలిచ్చారు. స్నేహితులు, కుటుంబం సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా సినిమా వినోదాన్ని పంచుతుంది” అన్నారు. కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.. “ఇప్పటిదాకా నేను పనిచేసిన దర్శకుల్లో అనుదీప్ది విభిన్న శైలి.
విశ్వక్సేన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. ఫంకీ నా కెరీర్లో మొదటి కామెడీ సినిమా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని చెప్పారు. ‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాన’ని అన్నారు
దర్శకుడు అనుదీప్. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “సినీ నేపథ్యంలో జరిగే కథ ఇది. అలా అని సీరియస్గా ఉండదు. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ ఇది. క్యూట్ కామెడీ ఫిల్మ్. సినిమా చూస్తున్నంతసేపు రెండు గంటలపాటు ప్రేక్షకుల ముఖంలో నవ్వు ఉంటుంది” అని తెలిపారు.