11 August, 2026 | 10:33 AM

ఎల్బీ నగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు

11-08-2026 09:36 AM

- ముగ్గురిని అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు 

ఎల్బీనగర్: అక్రమంగా ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతోపాటు గంజాయిని కొనుగోలు చేస్తుప్న వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన సోమవారం సాయంత్రం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాలు... చత్తీస్ ఘడ్ రాష్ట్రం, బస్తర్ జిల్లా కూకనర్ కు చెందిన సునీతనాగ్, పొజ్జ దర్దో సులభంగా డబ్బు సంపాదించడానికి గంజాయి విక్రయిస్తున్నారు‌.

ఇందులో భాగంగా ఒడిస్సా లోని మల్కాన్ గిరి జిల్లా పూలపల్లి లఖన్ ప్రాంతంలో కిలో గంజాయిని రూ. 3500 కిలో చొప్పున సునీత కొనుగోలు చేసి, కొజ్జా దర్దోతో కలిసి సుక్మా జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలానికి ఆటోలో వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ ఎల్బీనగర్ కు బస్సు ద్వారా ప్రయాణించారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోని సిల్వర్ ప్లేట్ హోటల్ దగ్గర నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంఅన్నారం గ్రామానికి చెందిన మంచాల రాజేశ్ కు కిలో గంజాయి రూ. 14000 చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు.