2 July, 2026 | 6:03 PM

34.5 కిలోల గంజాయి పట్టివేత

02-07-2026 05:19 PM

ఇద్దరు అరెస్ట్, మరొకరు పరారీలో

అమీన్‌పూర్, జూలై 2: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 34.5 కిలోల గంజాయితో పాటు ఒక బొలెరో వాహనం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

స్పెషల్ ఆపరేషన్ టీమ్ కుత్బుల్లాపూర్, అమీన్‌పూర్ పోలీసులు సంయుక్తంగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన OD30A7774 నంబర్ గల బొలెరో  వాహనాన్ని తనిఖీ చేయగా, రెండు మూటల్లో అక్రమంగా తరలిస్తున్న 34.5 కిలోల గంజాయి బయటపడింది.

ఈ కేసులో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాకు చెందిన  సుమిత్ బిపారి (25), బాబుల్ మండల్ (29)లను పోలీసులు అరెస్ట్ చేశారు. సుక్‌దేవ్ పరారీలో ఉన్నాడు  నిందితుల వద్ద నుంచి 34.5 కిలోల గంజాయి, బొలెరో పికప్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అమీన్‌పూర్ సీఐ నరేష్, ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.