02-06-2025 11:54:31 PM
పెట్రోకెమికల్ ఉత్పత్తులను అక్రమ దిగుమతి చేసుకున్నారని ఆరోపణలు..
కథనం ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్..
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల అధినేత, బిలియనీర్ గౌతమ్ అదానీ(Adani Group of Companies Chairman Gautam Adani) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇరానియన్ పెట్రో కెమికల్ ఉత్పత్తులను అదానీ గ్రూప్ కంపెనీలు అక్రమంగా దిగుమతి చేసుకున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ప్రఖ్యాత వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించి అదానీ కంపెనీలు తమ ముంద్రా పోర్టు ద్వారా ఇరానియన్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)ని భారత్కు దిగుమతి చేసుకున్నాయా లేదా అనే దానిపై అమెరికా ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. గుజరాత్లోని ముంద్రా, పర్షియన్ గల్ఫ్ మధ్య ప్రయాణించే ట్యాంకర్లు ఆంక్షలను తప్పించుకుని వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్కు సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించే అనేక ఎల్పీజీ ట్యాంకర్ల కార్యకలాపాలను అమెరికా న్యాయశాఖ సమీక్షిస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది.