02-06-2025 11:50:56 PM
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం..
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్(Union Commerce Minister Piyush Goyal) పేర్కొన్నారు. ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, భారత ప్రధాని మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలోనే మాట్లాడుకున్నారన్నారు.
వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్ను సందర్శించనుందని గోయల్ తెలిపారు. ఫ్రాన్స్ అధికారిక పర్యటనలో ఉన్న గోయల్ ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి అక్కడి నాయకులు, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.