25-05-2025 08:25:36 AM
-ట్రంప్ ముందు మోకారిల్లుతున్న మోడీ
-సిద్దాంతాన్ని చంపేయడం అమిత్ షా తరం కాదు
-సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
-మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా
-వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయం -కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం(విజయక్రాంతి): క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరుగా దివంగత సిపిఐ నేత, సాయుధ పోరాట యోధుడు నల్లమల గిరిప్రసాద్ నిలిచారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(CPI National Secretary K. Narayana) అన్నారు. తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం పరితపించిన మహోన్నతుడని ఆయన కొనియాడారు. గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిక్కాబజార్ హైస్కూల్ గ్రౌండ్స్లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడారు. గిరిప్రసాద్ ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితి నెలకొందని మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.
అమిత్ షా ప్రకటించినట్లుగా మావోయిస్టు నిర్మూలన 2026 మార్చి 31 కాదు కదా ఎన్నటికి అది సాధ్యం కాదని నారాయణ తేల్చి చెప్పారు. సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న కొంత మందిని హత్య చేయడం సాధ్యమేమో కాని సిద్ధాంతాన్ని చంపేయడం అంత తేలిక కాదని అదే సమయంలో మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలన్నారు. నాడు సాయుధ పోరాటంలో వేల మందిని హతమార్చారని గిరిప్రసాద్ ని సైతం హతమార్చాలని ప్రయత్నించినప్పుడు తుపాకి గుండుకు ఎదురొడ్డి నిలిచారని నారాయణ తెలిపారు. ఈ దేశంలో టెర్రరిస్టుల పట్ల మోడీ మెతక వైఖరిని అవలంభిస్తూ మావోయిస్టుల విషయంలో మాత్రం సరిహద్దు సైన్యాలను దింపి అంతమొందించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఎందుకు చర్చలు జరపడం లేదన్నారు. ప్రశ్నించే వారిని చంపేస్తూ నియంత పాలనవైపు మోడీ అడుగులేస్తున్నారని ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. మేము యుద్ధం వద్దంటే దేశ ద్రోహులన్నారని మరి యుద్ధం ఆపినమోడీ సర్కార్ ను ఏమనాలని నారాయణ ప్రశ్నించారు. ఈ దేశ రాజ్యాంగానికి మావోయిస్టుల నుంచి కానీ మరే ఇతరుల నుంచి కానీప్రమాదం లేదని ఆ ప్రమాదం బిజెపి వైపు నుంచి మాత్రమే పొంచి ఉందన్నారు.
మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా : కూనంనేని
మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా శాంతి చర్చలకు సిద్దమంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని బిజెపి ప్రభుత్వం హతమారుస్తుందని ఆయన ఆరోపించారు. గిరి ప్రసాద్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ నాడు నైజం రక్కసి మూకలు ఐదువేల మందిని హతమార్చారని నాడు నిజాం ప్రభుత్వం ఏవిధంగా పట్టుకొచ్చికాల్చి చంపిందో ఇప్పుడు బిజెపి ప్రభుత్వం అదే పంథాను అనుసరిస్తుందన్నారు. నేరస్తులు, ఆర్థిక అరాచవాదులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలమణి అవుతుంటే ప్రశ్నించే వారు ఏదో ఒక రూపంలో చంపబడటమో, జైళ్లలో ఉండటమో జరుగుతుందని ఆయన తెలిపారు. అమితే దాహం ఎంత మందిని చంపితే తీరుతుందని కూనంనేని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదంటున్నారని గుర్తు చేశారు.
ఈ దేశంలో అతిపెద్ద క్రిమినల్గా చెప్పుకునే అమితే ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగ భద్రత గురించి మాట్లాడటం -విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. కా॥ గిరిప్రసాద్ లాంటి అనేక మంది యోధుల వారసత్వంతో ప్రజా పోరాటాలకు సిద్దం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు. . ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కి సాబీర్ పాషా తదితరులు ప్రసంగించారు. సిపిఐ నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా ఆహుతులను వేదికపైకి ఆహ్వానించగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
జమ్ములజితేందర్రెడ్డి, మిరియాల రంగయ్య,
యర్రాబాబు, గిరిప్రసాద్ తనయుడు నల్లమల చక్రవర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, బిజి క్లెమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, -తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, తోట రామాంజనేయులు, ఏపూరి రవీంద్రబాబు, మందడపు రాణి, మిడికంటి వెంకట రెడ్డి, రావి -శివరామకృష్ణ, అజ్మీర రామ్మూర్తి, జాగర్లమూడి రంజిత కుమార్, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, ప్రజా సంఘాల నాయకులు నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, మడుపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.