11 July, 2026 | 8:46 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

11-07-2026 08:04 PM

మంథనిలో విద్యార్థులకు అవగాహనలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్

మంథని,(విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంథని గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... పిల్లలను సరైన మార్గంలో తీర్చిదిద్దే బాధ్యత కేవలం పోలీసులు, ఉపాధ్యాయులు లేదా వైద్యులదే కాదని, అందులో అత్యంత కీలకమైన పాత్ర తల్లిదండ్రులదేనని అన్నారు.పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, చిన్నప్పటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చాలని సూచించారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను గట్టిగా మందలిస్తే ఇంటి నుంచి వెళ్లిపోతారేమో లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారేమో అనే భయంతో అవసరమైన క్రమశిక్షణను పాటించడంలో వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు.

పిల్లలు కొన్నిసార్లు అలాంటి మాటలతో తల్లిదండ్రులను భయపెట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటి బెదిరింపులకు భయపడకుండా ప్రేమతో పాటు క్రమశిక్షణతో వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు.తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడాలని,వారి స్నేహితుల వర్గం, మొబైల్ ఫోన్ వినియోగం, సామాజిక మాధ్యమాల వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తల్లిదండ్రుల అప్రమత్తత,ప్రేమ, మార్గదర్శకత్వంతోనే పిల్లలను చెడు అలవాట్ల నుంచి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాల అలవాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకే వినియోగించాలని, అధిక వినియోగం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల ఫోన్ కాల్స్,సందేశాలు, లింకులు,నకిలీ వెబ్‌సైట్లు,ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు,ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ వెల్లడించవద్దని, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు.విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.