15-06-2025 12:49:18 AM
- అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా రికార్డు
- 14 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్న శుభాంశు బృందం
న్యూఢిల్లీ, జూన్ 14: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేది ఖరారైంది. జూన్ 19న ఆయన రోదసీలోకి వెళ్లనున్నారు. సాంకేతిక సమస్యలతో ఈ రోదసియాత్ర పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త తేదీని ప్రకటించింది. యాక్సియం కింద వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు రోదసియాత్రకు బయలుదేరనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
నెల 11న ప్రయోగానికి ముందు రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ప్రకటించింది. ఈ యాత్ర విజయవంతమైతే రాకేశ్శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు.
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తు న్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది.
ఇందులో శుభాంశు మిషన్ పైలెట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. అంతరిక్ష యాత్రల డైరెక్టర్ పెగ్గీ విట్సన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్సీొ్క విస్నీవ్స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరీ) ఇతర సభ్యులు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉం టుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.