28-06-2025 12:59:14 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీలంటే కేంద్ర బీజేపీకి చిన్న చూపేందుకో
బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి టీ.చిరంజీవులు
ముషీరాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వీటిని తిప్పి కొట్టేందుకు బీసీలంతా సిద్ధం గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని అన్నారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ మేధావుల ఫోరమ్ ఛైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాజుల ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. న్యాయస్థానం నెలరోజుల్లో రిజర్వేషన్లను నిర్ణయించి, ఎన్నికల సంఘానికి నివేదించాలని ఆదేశించి నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు రోజుకో మాట చెప్తూ బీసీలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బిజెపి పార్టీలు మాత్రమే రిజర్వేషన్లను తేల్చాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48 గంటల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జాజుల డిమాండ్ చేశారు. బిజెపి పార్టీకి బీసీల ఓట్లు కావాలంటే, 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు.
లేని పక్షంలో బీసీలంతా ఏకమై రోడ్లమీదకు వచ్చి రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. అనంతరం చిరంజీవులు మాట్లా డుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు అని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను వారం రోజుల్లో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీల రిజర్వేషన్లపై ఎందుకు ముందు కు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
బీసీలలో చైతన్యం వచ్చిందని, 2028లో వచ్చేది బీసీల రాజ్యమే అని చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్,
బీసీ ఇంటలె క్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు, కెవి.గౌడ్, పాలకురి అశోక్, చెన్న శ్రీకాంత్, ఒంటెద్దు నరేందర్, ఘోర శ్యామ్, దుర్గయ్య గౌడ్, అవ్వారు వేణు, కొండల్ గౌడ్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, బైరు శేఖర్, ఆయిలి వెంకన్న గౌడ్, విక్రమ్, ఎర్ర మాద వెంకన్న, రాపోలు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.