17-05-2025 03:49:44 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు.వి హబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను రేవంత్ రెడ్డి సమక్షంలో మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించి, వారిని ఆర్థికంగా నిలబెట్టాలని, ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణ, వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధంచాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని, ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు రూ.5 వేల మేరకు ఆదా అయిందని, దీంతో ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టిందన్నారు.
ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించామని, 600 బస్సులను వెంటనే తీసుకుని నడిపించాలని, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రూ.500లకే సిలిండర్, పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించామని, పాఠాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు 1 కోటి 30 లక్షల యూనిఫామ్ డ్రెస్సుల బాధ్యత కూడా వారికే అప్పగించామని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని, వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించాం.
ఇలా ప్రతి చోటా, ప్రతి సందర్భంలోనూ మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. మహిళా శక్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. గతేడాది 20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి చెల్లించారు. #SHG సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాదు. వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చు.
పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతాయి. 1967 లో చైనాతో, 1971 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సందర్బంగా ఇందిరా గాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుంది” అని సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి గారు, వీహబ్ ప్రతినిధులు, వివిధ సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.