మందుబాబులకు అడ్డాగా సర్కారు బడి!
- నిధులు లేక నిలిచిన పాఠశాల భవనం
- వసతులు లేక ప్రైవేటు బాటలో పిల్లలు..
- బెల్ట్ షాపులపై ఊరి జనం ఆగ్రహం
మాడుగుల, అగస్టు 2(విజయక్రాంతి): చదువులు చెప్పాల్సిన బడి భవనం.. అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మాడుగుల మండలం బ్రాహ్మణపల్లిలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం సగంలోనే నిలిచిపోవడంతో స్థానిక విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ భవనం అందుబాటులోకి రాకపోవడంతో వేరే దారిలేక పేద కుటుంబాలు కు చెందిన తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు రూ.వేలు ఖర్చు చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న అసంపూర్తి భవనం రాత్రి వేళల్లో తాగుబోతులకు, జూదరులకు స్థావరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డానికి తోడు గ్రామంలో అక్రమ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తుండటంతో అరాచకాలు పెరుగుతున్నాయని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు... పట్టించుకోకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మందుబాబులు తాగి తందనాలు ఆడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తి పాఠశాల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, గ్రామంలోని బెల్ట్ షాపులను ఎత్తివేసి విద్యార్థులకు, గ్రామస్థులకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






