15-10-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14, (విజయక్రాంతి): జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా, పార దర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు-కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖాధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలి పారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు.
అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిం చారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను వివరించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ గ్రేడ్ రకానికి రూ.2,369, సన్న రకం ధాన్యానికి అదనంగా 500 రూపాయలు ప్రతి క్వింటాకు 2889 మద్దతు ధర నిర్ణయించబడిందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు వంటి సదుపాయాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు టోకెన్ల వ్యవస్థ ద్వారా రద్దీ నియంత్రణ చేపట్టాలని, రైతు ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్కి వచ్చే OTP ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. గన్నీ సంచులు ఆన్లైన్లో నమోదు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని, సంచులు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
మన జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకను నివారిం చేందుకు సరిహద్దుల్లో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆన్లైన్లో నమోదు చేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాలు పాటించక పోతే లేదా తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత ఇన్చార్జి లపై, మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి రైతు ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ప్రతులతో రావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత గన్నీ సంచులకు ట్యాగ్, సెంటర్ నెంబర్ వేయాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు త్వరితగతిన తరలించాలన్నారు. సీఎంఆర్ 2025-26 రబీ సీజన్కి సంబంధించిన డెలివరీలను సకాలంలో పూర్తి చేసేలా రైస్ మిల్లులను తనిఖీ చేసి నివేదికలు సమర్పిం చాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి రుక్మిణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు,డీసీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి బాబురావు, రవాణా శాఖ అధికారి వెంకటరమణ , తూనికలు-కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందరావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.