29-05-2025 02:49:44 AM
- తరుగు తేమ పేరుతో మిల్లర్లు కొర్రీలు
- వేదిస్తున్న లారీలు, హమాలీల కొరత
- ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... రైతు కుటుంబమంతా కళ్ళాల్లోనే..
- కంటి తుడుపుగా కలెక్టర్ పర్యటనలు
- తప్పులను గుర్తించినా చర్యలు శూన్యం
నాగర్ కర్నూల్ మే 28 (విజయక్రాంతి): ఓవైపు తరముకొస్తున్న రుతుపవనాలు మరోవైపు హమాలీలు, లారీల కొరత అధికారుల అలసత్వం వెరిసి రైతుల కష్టం వర్షార్పణమౌతోంది. పంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ధాన్యాన్ని తూకం వేసి మిల్లర్లకు పంపాల్సిన అధికారులు హమాలీలు, లారీలు కొరత ఉందంటూ సాకులు చెప్తున్నారని రైతులు మండిపడుతు న్నారు.
ఆయా కొనుగోలు కేంద్రాల్లో అప్పటికే తూకం వేసి లారీలను ఆయా మిల్లులకు తరలించినప్పటికీ మిల్లర్లు తరుగు, తేమ పేరుతో కొర్రీలు పెట్టి వాహనాల్లోని ధాన్యాన్ని దించుకోకపోవ డంతో కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత ఏర్పడుతోందని కొంతమంది అధికారులు సాకులు చెప్తున్నారు.
గతంలోనే సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐకి బియ్యం తరలించకపోయినా మిల్లర్లతో కుమ్మకై అధికారులు కొందరు అవే మిల్లులకు మళ్లీ ధాన్యాన్ని కేటాయిస్తున్నారని ఇతర మిల్లర్లు ఆరోపిస్తున్నారు. మరికొన్ని అధికారులకు అనుకూలంగా ఉన్న మిల్లర్లకు అత్యధిక ధాన్యాన్ని కేటాయించడంతో రైతుల నుండి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి.
రైస్ మిల్లర్లతో కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు లోపాయి కారి ఒప్పందాలు చేసుకొని వారికి అనుకూలంగానే అడుగులు వేస్తూ రైతులను మాత్రం నట్టేట ముంచుతున్నారని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తీరా అమ్ముకోవడం కోసం కల్లాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు రక్షణగా కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు మండిపడుతున్నారు.
కుటుంబం లోని పిల్లా జెల్లా అంతా కళ్ళల్లోనే ఉంటూ ఎండకు ఎండబెడుతూ వానకు తడవకుండా అనేక ఆపసోపాలకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత సిబ్బంది అధికారులు అలసత్వం వహించినట్లు జిల్లా కలెక్టర్ పర్యటనలో గుర్తించినప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది.
నిబంధనలను ఉల్లంఘించి రైతులు నష్టపోయే విధంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా నేరుగా కలెక్టర్ పర్యటించిన సందర్భాల్లో అధికారుల అలసత్వం గుర్తించినప్పటికీ పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు ఆలస్యం అవుతుందని ఇతర పంట సాగు కోసం పనిచేసుకోలేక ఆయా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 రోజులుగా ఆయా కల్లాల వద్ద వరి ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడంతో ధాన్యం మొలకెత్తుతుందని రైతులు దిగులు పడుతున్న పరిస్థితి.
ప్రస్తుతం ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలచే ధాన్యం తరలింపు చేస్తున్నారు ధాన్యం తరలింపు కోసం ఒప్పందం చేసుకున్న లారీ ఓనర్లు కూడా తక్కువ సంఖ్యలో లారీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవ డంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,04,712 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించగా 1,03,617 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఆయా రైస్ మిల్లర్లకు సరఫరా చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకా 1,095 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గుతోందని అధికారిక లెక్కలే చెప్తున్నాయి .
కానీ అనధికారికంగా ఇప్పటికీ ఆయా రైతుల నుంచి కొనుగోలు చేయకుండా కళ్ళాల్లోనే మగ్గుతున్న ధాన్యం ఇంకా 50వేల మెట్రిక్ టన్నుల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.