29-05-2025 02:36:49 AM
- చివరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నరకం
- వర్షం కారణంగా మరింత ఆందోళన
- చి‘వరి’ కొనుగోళ్లలో ఇబ్బందులు
- నిలిచిన ఎగుమతులు
మహబూబాబాద్, మే 28 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోళ్ల చివరి అంకంలో అకాల వర్షం, రైస్ మిల్లర్ల కొర్రీలు, లారీల కొరత అటు అన్నదాతలకు, అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 90 శాతం వరకు ధాన్యం కొనుగోళ్ళు పూర్తికాగా, 10 శాతం మాత్రమే దాన్యం సేకరణ మిగిలిపోయింది.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సింది మరో 10 శాతం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నా యి. అయితే ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి లేదని రైసు మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతుండడంతో లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి పడికాపులు పడాల్సి వస్తోంది.
దీనితో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తిచేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న ధాన్యం మిల్లులకు తరలించడానికి లారీల కొరత ఏర్పడుతోంది. నెల నుంచి నెల 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న రైతులకు ఓపిక నశించి ఆందోళన బాటపడుతున్నారు. అకాల వర్షాలతో అక్కడక్కడ ధాన్యం తడిసి మొలకెత్తుతోంది.
దీనికి తోడు వానకాలం పంట సాగు కు రైతులు శ్రీకారం చుట్టారు. కొందరు ఇప్పటికీ యాసంగి పంట విక్రయించడం ఎలా అంటూ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి వరి పంట సాగు తమకు ఎక్కడలేని గోస తెచ్చిపెట్టిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కొద్దిపాటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, కాంటాలు పూర్తిచేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసి తమకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.
రంగంలోకి దిగిన కలెక్టర్
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని పూర్తి చేయడానికి స్వయంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం రంగంలోకి దిగారు. తొర్రూరు, మరిపెడ, దంతాలపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అధికారులను అప్రమత్తం చేశారు.
అకాల వర్షాలు నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార యంత్రం సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికాకండి.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
బస్తాలు ఇవ్వడానికే నెల రోజులు పట్టింది
నెల రోజుల కిందట పంట కోత పూర్తి కాగానే ధాన్యా న్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాం. రోజు మా ఊరు అయ్యగారిపల్లె నుంచి ఇనుగుర్తి కొను గోలు కేంద్రానికి వచ్చి వెళుతున్నాను. నెల రోజులకు సోమవారం బస్తాలు ఇచ్చారు. ఇంకా కాంటాలు పెట్టడానికీ ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి.
పంట పండించడం ఒక ఎత్తు అయితే, అమ్ముకోవడం పెద్ద కష్టంగా మారింది. నెలరోజుల కమానం ఇంటికాన్నుంచి పనులన్నీ వదులుకొని కొనుగోలు కేంద్రానికి వచ్చి వెళ్తున్నాం. కాంటాలు పూర్తి చేసిన మిగిలిన రైతుల ధాన్యం ఇంకా మిల్లులకు పంపలేదు. మా ధాన్యం మిల్లుకు పోయేసరికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి.
భూక్యా వినోద, అయ్యగారిపల్లి, మహబూబాబాద్