వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం
గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ మంత్రి
ఆసుపత్రి నిర్వహణపై అసహనం
నంగునూరు, (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao ) స్పష్టం చేశారు.శనివారం నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిజిస్టర్లను,మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు.ఆసుపత్రి నిర్వహణ తీరుపై హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు.
అక్కడికక్కడే సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఎప్పటికప్పుడు 'టీ-డయాగ్నోస్టిక్స్'కు పంపాలని, 24 గంటల లోపే రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వాగు అవతలి గ్రామాల ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే గట్లమల్యాలలో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని,ఇంతటి ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రంలో సేవలు కుంటుపడటం తగదన్నారు.




