22-06-2025 06:46:21 PM
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క(Minister Anasuya Seethakka)కు ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Former Minister Harish Rao) లేఖ రాశారు. గ్రామాల్లో కుంటుపడిన పారిశుధ్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, పంచాయతీ నిధుల విడుదల, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యల గురించి లేఖ ద్వారా హరీష్ రావు పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో కేసీఆర్(KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని, ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు.
గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయని హరీష్ రావు ఆరోపించారు. నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయింది.. పారిశుధ్యం పడకేసింది.. వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయి.. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చిందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేసారని, ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని తెలిపారు. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారని, ఇదే విధంగా మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
కాబట్టి ఈ కింది సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు:
1. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలి.
2. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
3. అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలి.
4. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుధ్యం పెంపొందించాలి.
5. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వారికి వేతనాలు చెల్లించాలి.
6. గతేడాది నవంబర్లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయం. వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలి.