వయనాడ్ ప్రజలకు సీతక్క చేయూత
రూ.20 లక్షల చెక్కు అందజేత
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్లో మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాల సహాయార్థం సేకరించిన రూ.20 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే టీ.సిద్ధికికి అందించారు. దీంతోపాటు సుమారు పది లక్షల విలువగల దుస్తులు, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకుకు అందజేశారు. అనంతరం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాలను చూసి తన హృదయం ద్రవించిపోతోందన్నారు. విపత్తు వల్ల నష్టపోయిన వారికి సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఉన్నారు.






