28-05-2025 01:06:24 AM
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, మే 27 (విజయక్రాంతి): రైతులు ఆయిల్ ఫాం పంటల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఉద్యానవన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించే వరి నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని, కూలీల కొరత అధికంగా ఉందని, వరికి వచ్చే చీడపీడల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల లాభసాటి పంటలు పండించాలని సూచించారు.
ఆయిల్ పామ్ పంటనే దానికి ప్రత్యామ్నాయమని తెలిపారు. ఆయిల్ ఫాంలో అరటి, బొప్పాయి, వక్క, కోకో వంటి అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం కూడా పొందవచ్చన్నారు. ఈ సంవత్సరంలో 3750 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలను వేసేందుకు లక్ష్యంగా ఉందన్నారు.
డిహెచ్ఎస్ఓ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆయిల్ పామ్ పట్ల అవగాహన పెంపొందించడానికి లోహియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.